ఆసీస్‌ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే! | Australia Restricts Use Of Saliva, Sweat To Shine Ball | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే!

May 2 2020 12:06 PM | Updated on May 2 2020 12:10 PM

Australia Restricts Use Of Saliva, Sweat To Shine Ball - Sakshi

సిడ్నీ:  కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియా పలు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాలో క్రికెట్‌ అత్యంత ఆదరణ క్రీడ కావడంతో  పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. క్రికెట్‌ కార్యకలాపాలు పునరుద్ధించబడ్డాక లాలాజలం(సలైవా), స్వీట్‌ పదార్థాలను బంతిపై మెరుపు కోసం ఉపయోగించుకుండా ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) బంతిని షైన్‌ చేయడానికి సలైవాను నిషేధించాలనే కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. అదే సమయంలో అంపైర్ల సమక్షంలో ‘ట్యాంపరింగ్‌’కు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుగా తమ ప్రణాళికలను సిద్ధం చేసింది. సలైవాపై ఐసీసీ నిషేధం విధించినా, విధించకపోయినా తమ క్రికెట్‌ జట్టు మాత్రం అందుకు దూరంగా ఉండాలనే మార్గదర్శకాలను సిద్ధం చేసింది. (మార్చాల్సిన అవసరం ఏమిటి?: వార్నర్‌)

ఈ మేరకు ఆస్ట్రేలియా సమాఖ్య ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం ముగిసి క్రికెట్‌ ఆరంభమైన తర్వాత ఇవి కచ్చితంగా పాటించాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(ఏఐఎస్‌).. వైద్యరంగ నిపుణులతో పాటు క్రీడా సంఘాలు, ప్రభుత్వంతో చర్చించి కొన్ని నిబంధనలు సూచించింది. ఇందులో ఏ,బీ,సీలుగా మూడు కేటగిరీలను పొందు పరిచింది. లెవల్‌-ఎలో వ్యక్తిగత ప్రాక్టీస్‌ను మినహాయించి అన్ని రకాల ప్రాక్టీస్‌లకు దూరంగా ఉండాలని పేర్కొంది. లెవల్‌-బిలో నెట్‌ ప్రాక్టీస్‌‌లో బ్యాటర్స్‌ బౌలర్లను ఎదుర్కోనే క్రమంలో బౌలర్లు పరిమితంగా ఉండాలని తెలిపింది. వ్యక్తికి వ్యక్తికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వార్మప్‌ డ్రిల్స్‌కు దూరంగా ఉండాలని పేర్కొంది. (‘బాల్‌ టాంపరింగ్‌ చేసుకోవచ్చు’)

ఇక లెవల్‌-సిలో భాగంగా పూర్తి స్థాయి ట్రైనింగ్‌, కాంపిటేషన్‌కు సిద్ధమయ్యే క్రమంలో బంతిని సలైవాతో రుద్దకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది.ఎవరైనా ఆటలోకి పునరాగమనం చేయాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఆపై ఏ ఆటగాడైనా అనారోగ్యానికి గురైతే పునరావాస శిబిరంలోకి తరలించాలని తెలిపింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని పేర్కొంది.  ట్రైనింగ్‌ సెషన్స్‌లో కూడా ఆటగాళ్లు అన్ని నిబంధలను అమలు చేయాలని తెలిపింది. కరోనా సోకి కోలుకున్న సదరు అథ్లెట్‌కు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement