మళ్లీ వాయిదానా..? | rajinikanth robo 2.o Postponed again.? | Sakshi
Sakshi News home page

మళ్లీ వాయిదానా..?

Jan 30 2018 7:55 AM | Updated on Jan 30 2018 7:55 AM

rajinikanth robo 2.o Postponed again.? - Sakshi

రోబో 2.ఓ ప్రచారచిత్రం

తమిళసినిమా: 2.ఓ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందా? అలాంటి అవకాశం లేకపోలేదంటున్నారు సినీ వర్గాలు. 2010లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా స్టార్‌ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ఎందిరన్‌. దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి రజనీ, శంకర్‌ల టీమ్‌ సిద్ధం అయిన విషయం తెలిసిందే. 2.ఓ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎందిరన్‌ కంటే అద్భుతంగా రూపొందించాలని భావించారు. అందుకు లైకా సంస్థ ముందుకొచ్చింది. ఈ చిత్రం సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. రజనీకాంత్‌కు జంటగా ఇంగ్లీష్‌ బ్యూటీ ఎమీజాక్సన్, విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌లు నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీత భాణీలను అందిస్తున్నారు.  రెండేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకుంది.గతేడాది అక్టోబరులో దుబాయ్‌లో చిత్ర ఆడియోను ఘనంగా విడుదల చేశారు. కాగా ఇటీవల ఒక నిమిషం 48 సెకన్లతో కూడిన ఈ చిత్ర మేకింగ్‌ వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. దీంతో 2.ఓ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

అభిమానుల్లో నిరాశ: చిత్ర విడుదల తేదీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ముందుగా 2.ఓ చిత్రాన్ని గతేడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు  ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్‌ పనులు పూర్తి కాకపోవడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఏప్రిల్‌ 27న తెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూడోసారి ప్రకటనలో కూడా మార్పు జరిగేటట్లుందని సమాచారం. చిత్ర గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదట. చిత్ర టీజర్‌ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. ప్రస్తుతం శంకర్‌ ఈ చిత్ర టీజర్‌ను అమెరికాలోని లాస్‌ఏంజల్స్‌లో రూపొందించే పనిలో ముమ్మరంగా ఉన్నారట. ఒకవేళ ఏప్రిల్‌ 27న 2.ఓ చిత్రం విడుదల కాకపోతే మే నెలకు వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement