‘అవినీతి అనకొండలు బయటకొస్తున్నాయి’ | YSRCP Trade Union President Slams TDP Leaders Over Corruption | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలైంది’

Jun 13 2020 7:07 PM | Updated on Jun 13 2020 7:17 PM

YSRCP Trade Union President Slams TDP Leaders Over Corruption - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టుల పర్వం మొదలైందని అవినీతి పుట్టలోని ఒక్కొక్క పాము బయటకు వస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్సార్‌ సీపీ  కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో అవినీతి అనకొండలు ఉన్నాయని గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆ అవినీతి కొండలు ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు.
(తప్పు చేసినవారే తప్పించుకునే యత్నం..)

జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆస్మిత్‌ రెడ్డి, భూపాల్‌రెడ్డిలపై పోలీసులు తీసుకున్న చర్యలను ముందుగా అభినందిస్తున్నట్లు గౌతమ్‌రెడ్డి తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి జేసీ ప్రభాకర్‌రెడ్డి జేబులు నింపుకున్నారని విమర్శించారు. బీఎస్‌3 వాహనాలను బీఎస్‌4 వాహనాలుగా చూపి నకిలీ రిజిస్ట్రేషన్లు చేశారన్నారు. అంతేకాకుండా స్క్రాప్‌లో వాహనాలను కొనుగోలు చేసి నాగాలాండ్‌లో ఎన్‌ఓసీతో రిజిస్ట్రేషన్‌లు చేయించారన్నారు.  గతంలో ఈ నకిలీ రిజిస్ట్రేషన్‌ వాహనాలతోనే 42 మంది ప్రాణాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి బలికొన్నారని మండిపడ్డారు. అంతర్రాష్ట్ర మోసాలకు సైతం పాల్పడ్డారని మండిపడ్డారు.  జటాదర్‌ కంపెనీ పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. ఇందులో జేసీ దివాకర్‌రెడ్డి హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. (జేసీ ప్రభాకర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌)

చెత్త నుంచి డబ్బులు సంపాదించే చెత్త మనుషులు సొసైటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారని గౌతమ్‌రెడ్డి విమర్శించారు. యమకింకరులా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర నేరగాళ్లపై పెట్టే సెక్షన్ల కేసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పెట్టాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలు, దందాలతో అనంతపురం జిల్లా ప్రజలను జేసీ ప్రభాకర్‌రెడ్డి భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.చంద్రబాబు హయాంలో దోచుకొని దాచుకొన్న వారందరూ ఇప్పుడు గందరగోళం చేస్తున్నారన్నారు. గతంలో ప్రాజెక్టుల పేరుతో ఇష్టానుసారంగా దండుకున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చిందని పి.గౌతమ్‌రెడ్డి తెలిపారు.  (అచ్చెన్న అరెస్ట్‌ తొలి అడుగు మాత్రమే..)

Advertisement
 
Advertisement
Advertisement