
సాక్షి, బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పొరపాటున కేంద్ర మంత్రి సదానంద గౌడ తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే తొందరలో ఆయన తడబడ్డారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విమర్శించే తొందరలో.. నరేంద్రమోదీనే తూలనాడారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నరేంద్రమోదీకి సిగ్గుండాలి’ అని పొరపాటున వ్యాఖ్యానించారు.
బీజేపీ చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా శనివారం దక్షిణ కర్ణాటకలోని బంట్వాళలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో సదానందగౌడ పాల్గొన్నారు. ఈ వేదికపైనే.. సీఎం సిద్ధరామయ్యపై విమర్శలు చేశారు. అదేజోరులో మోదీని తిట్టేశారు. అనంతరం సహచరుల సూచనతో ఆ పొరపాటును సరిచేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.