‘పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం’
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధం గా రావాల్సిన 34% రిజర్వేషన్లను తగ్గించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం విద్యానగర్లోని బీసీభవన్లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామపంచాయతీల్లో బీసీలకు 4,335 స్థానాలు కేటాయించాలని, కానీ ఎస్టీలకు కేటాయించిన స్థానాలు తీసేసి మిగిలిన 10,117 గ్రామపంచాయతీలకు గానూ 34% రిజర్వేషన్తో కేవలం 3,440 స్థానాలనే బీసీలకు కేటాయించారన్నారు.
పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 56 శాతానికి పెంచుతామన్న కేసీఆర్.. సీఎం అయ్యాక ఉన్న రిజర్వేషన్లను 27 శాతానికి తగ్గించాలని చూడటం సిగ్గు చేటన్నారు. రిజర్వేషన్లను తగ్గించకుండా బీసీలకు తగిన స్థానాలను కేటాయించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.