రూ.30 లక్షలు తెచ్చి ఇచ్చిందెవరో చెప్పాలని మత్స్యకార పెద్ద కాపులు పట్టు
సోనాబోట్ల విడుదల నేపథ్యంలో నాలుగు గ్రామాలకు భారీ జరిమానా
రూ.5 కోట్లు చెల్లించాల్సిందేనని పెద్ద కాపులు ఆదేశం
రూ.1.50 కోట్లు కడతామన్న నాలుగుపాలేల మత్స్యకారులు
ఈ ఘటనలో ఎవర్నీ వదిలిపెట్టబోమని మత్స్యకార పెద్దల హెచ్చరిక
ఏకధాటిగా 14 గంటలపాటు పంచాయితీ నడిపిన పెద్దలు
అర్ధంతరంగా ముగిసిన సమావేశం
సింగరాయకొండ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నుంచి తమిళనాడు బోట్లు వదిలేయడం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు హస్తం ఉందని మత్స్యకారులు వెల్లడించడం సంచలనంగా మారింది. అయితే బీద మస్తాన్రావు ముగ్గురు మత్స్యకారులకు రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పి, ఆ డబ్బులు తెచ్చి ఇచ్చిన వారి పేరు మాత్రం బయటకు చెప్పకపోవడం గమనార్హం. మత్స్యకారులకు సుపరిచితమైన అధికార తెలుగుదేశం పార్టీ నేతలే తెరవెనుక ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
గత నెల 14న హార్బర్ నుంచి తమిళనాడులోని కరైక్కల్కు చెందిన నాలుగు సోనా బోట్లు వదిలేయడం వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చేందుకు సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా పాకల పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన దాదాపు ఐదు వేల మంది మత్స్యకారులు సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మంగళవారం ఉదయం 7 గంటల వరకూ అంటే 14 గంటల పాటు పెద్దలు పంచాయితీ నడిపారు.
తొలుత బోట్లను వదిలేసిన నెల్లూరు జిల్లా కొత్తబంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డి, ఇస్కపల్లికి చెందిన తోటయ్య, పాతపాలెంకు చెందిన శెట్టిలను సమావేశంలో అందరిముందూ హాజరుపరిచారు. గత నెల 14న ఏం జరిగిందో చెప్పాలని మత్స్యకార పెద్దలు నిలదీశారు. బోట్లు వదిలేసింది తామేనని వారు అంగీకరించారు. అయితే తెర వెనుక సూత్రధారులు, పాత్రధారుల పేర్లు వెల్లడించలేదు. పేర్లు చెప్పి తీరాల్సిందేనని మత్స్యకారులు పట్టుపట్టడంతో ఆరుగంటల తర్వాత అంటే రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇస్కపల్లికి చెందిన తోటయ్య వాస్తవాలను సభ ముందుంచారు.
బోట్లు వదిలేయాలని అధికార టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు డబ్బులు ఇచ్చారని వెల్లడించాడు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పడం తీవ్ర సంచలనాన్ని కలిగించింది. కావలి సీఐ పాత్ర కూడా ఉందని మరో సభ్యుడు శెట్టి వెల్లడించాడు. అయితే అసలు డబ్బులు తెచ్చి ఇచి్చన వారి పేర్లు మాత్రం వారు వెల్లడించలేదు.
రూ.5 కోట్లు చెల్లించాలి
బోట్ల వదిలివేతకు నాలుగు గ్రామాల మత్స్యకారులు బాధ్యత వహించాలని పెద్దలు ఆదేశించారు. దీనికి ఆయా గ్రామాల కాపులు సమ్మతించటంతో రూ.5 కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేశారు. అయితే మత్స్యకారులు రూ.1.50 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి మత్స్యకార పెద్దకాపులు అంగీకరించలేదు. దీంతో కొద్దిసేపు సందిగ్ధం నెలకొంది. ఈలోగా మత్స్యకారులు డబ్బులు అయినా ఇస్తాము లేదా మూడు బోట్లను తెచ్చి పెడతామని చెప్పారు. కానీ పెద్ద కాపులు ససేమిరా అన్నారు.
ఒక దశలో వదిలేసిన బోట్లను తెచ్చి పెట్టాలని పెద్ద కాపులు చెప్పారు. రెండు కొత్త బోట్లు కొనిస్తామని ఇస్కపాలెం కాపులు చెప్పడంతో ఒక దశలో చెన్నాయపాలెం, ఇస్కపల్లి మత్స్యకారుల మధ్య వాగ్వాదం రేగింది. దీంతో పెద్ద కాపులు సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని మత్స్యకార పెద్ద కాపులు స్పష్టం చేశారని తెలిసింది. రెండు మూడు రోజుల్లో పెద్దలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సమావేశానికి పోలీసులు మఫ్టీలో బందోబస్తు నిర్వహించారు.


