‘పవన్‌ కల్యాణ్‌వి వింత రాజకీయాలు’

Ummareddy Venkateswarlu Slams Pawan Kalyan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వింత రాజకీయాలు అనుసరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలపై పవన్‌కు క్లారిటీ ఉందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పవన్‌ టీడీపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్ని సభలు పెట్టినా.. పవన్‌ మద్దతు తెలుపలేదని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్‌ ఏనాడూ విమర్శించలేదని.. ఎందుకంటే వారి మధ్య అనుబంధం అలాంటిందని వ్యాఖ్యానించారు. రైతులకు వ్యతిరేకంగా చంద్రబాబు భూసేకరణ చేసిన పవన్‌ ప్రశ్నించలేదు.. పైగా సమర్థించే ప్రయత్నం చేశారని అన్నారు. జన్మభూమి కమిటీల్లోని అక్రమాలపై, ఇసుక అక్రమాలపై పవన్‌ చంద్రబాబును ప్రశ్నించారా అని నిలదీశారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడితే పవన్‌ ఏం చేశారని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్లే పవన్‌, చంద్రబాబును ఏనాడు ప్రశ్నించలేదని అన్నారు.

నాలుగేళ్లు నోరు ఎత్తకుండా.. ఇప్పుడు వచ్చి ప్రతిపక్షనేతపై మాట్లాడం ఎమిటని ఆయన పవన్‌ కల్యాణ్‌ను నిలదీశారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే పవన్‌ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అది డ్రామా అని డీజీపీ ప్రకటన చేస్తే, పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top