మోదీపై టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శలు

TRS MP Ranjith Reddy Fires On PM Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌కు చెందిన చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో చేసిన తప్పల కంటే బీజేపీ ప్రభుత్వం ఘోర తప్పిదాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారని, కరోనా వైరస్‌ను ఎదుర్కొవడంలో మోదీ సర్కార్‌ తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలను రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో నిలదీస్తామని రంజిత్‌ రెడ్డి చెప్పారు. కాగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఏడాదిపూర్తి అయిన సందర్భంగా ప్రగతి నివేదన కార్యక్రమంతో ఎంపీ రంజిత్‌ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రజాసేవ చేస ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా అని, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సమఖ్య స్ఫూర్తితో నడిచే ప్రభుత్వం కావాలని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో అన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. వైద్య విద్య ఉపాధి కల్పించలేక ఇంకా ఎన్నాళ్ళు దేశ ప్రజలను మోసం చేస్తారు. లాక్‌డౌన్‌ ప్రకటించే సమయంలో వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం ఇవ్వలేదు. వారిని చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదు. కోవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగింది. కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారు. హెలికాప్టర్ మినీ అని సీఎం కేసీఆర్‌ చెబితే కనీసం పట్టించుకోలేదు. 

మోదీ ఇన్ని సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. కానీ సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాలకు చేయూత అందించడం లేదు. ఎఫ్‌ఆర్‌బీఎంలోన్ పరిమితి పెంచడానికి రాష్ట్రాలకు నానా రకాల ఆంక్షలు పెడుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొనే వెసులు బాటు తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రాలను న్యాయం చేయడం లేదు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారు. వీటన్నిటి మీద పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంను నిలదీస్తాం. స్థానిక బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి కేంద్రం నుంచి తెచ్చే నిధులు గురించి కొట్లాడాలి’ అని అన్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top