కేసీఆర్‌ని బట్టేబాజ్‌ అని బరాబర్‌ అంటాం: ఉత్తమ్‌ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ని బట్టేబాజ్‌ అని బరాబర్‌ అంటాం: ఉత్తమ్‌

Published Fri, Oct 5 2018 4:45 PM

TPCC President Utham Kumar Reddy Slams CM KCR In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ని బట్టేబాజ్‌ అని బరాబర్‌ అంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..నిరాహార దీక్ష చేసే సమయంలో కేసీఆర్‌ కేవలం గడ్డం మాత్రమే పెంచుకున్నాడని, నిమ్స్‌ ఆసుపత్రి ఇచ్చిన నివేదిక చూస్తే కేసీఆర్‌ బాగోతం బయటపడుతుందని వెల్లడించారు. అవసరం లేకపోయినా ప్లూయిడ్స్‌ తీసుకుని దొంగ దీక్ష చేశాడని ఆరోపించారు. ఇలాంటి దొంగ దీక్షలు చేసి తన వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేందుకు సిగ్గూ శరం ఉండాలని ధ్వజమెత్తారు.

నిజామాబాద్‌ సభలో తన గురించి అడ‍్డగోలుగా మాట్లాడాడని విమర్శించారు. తాను దేశం కోసం సరిహద్దులో పైలట్‌గా పనిచేస్తే... కేసీఆర్‌ మాత్రం దుబాయికి దొంగ పాసుపోర్టుల ఏజెంట్‌గా పనిచేశాడని ఆరోపించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేస్తే అప్పటి ఎంపీ ఎమ్మెస్సార్‌ విడిపించాడని గుర్తు చేశారు. తనకు పిల్లలు లేరని.. ప్రజలే తమ వారసులు ఉత్తమ్‌ పేర్కొన్నారు. సిగ్గూ లజ్జ లేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్‌నేని తీవ్రంగా మండిపడ్డారు.

జాతీయ నాయకుల జయంతి రోజున వారికి పూలమాల వేసే తీరిక కూడా కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేదన్న కేసీఆర్‌, మహా కూటమిని చూసి ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ముదనష్టపు కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement