తెలంగాణ టీడీపీకి కొత్త కమిటీ  | Telangana TDP new committee | Sakshi
Sakshi News home page

తెలంగాణ టీడీపీకి కొత్త కమిటీ 

Sep 24 2017 1:29 AM | Updated on Oct 20 2018 7:44 PM

Telangana TDP  new committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీ టీడీపీ)కి కొత్త రాష్ట్ర కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధ్యక్షునిగా ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని నియమించారు. అలాగే కేంద్ర కమిటీలో రాష్ట్రానికి చెందిన గరికపాటి మోహన్‌రావు (వరంగల్‌), ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (ఖమ్మం), ఇ.పెద్దిరెడ్డి (కరీంనగర్‌), బక్కని నర్సింహులు (మహబూబ్‌నగర్‌), కొత్తకోట దయాకర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌)లకు చోటు దక్కింది. మొత్తం 17  మందితో ఏర్పాటు చేసిన పార్టీ పొలిట్‌బ్యూరోలో  తెలంగాణకు చెందిన ఏడుగురు నేతలకు చోటు దక్కింది.

టి.దేవేందర్‌ గౌడ్‌ (రంగారెడ్డి), ఎలిమినేటి ఉమామాధవరెడ్డి (నల్లగొండ), మోత్కుపల్లి నర్సింహులు (నల్లగొండ), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (వరంగల్‌), ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క (వరంగల్‌)లను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. కాగా, టీ టీడీపీ తెలంగాణ కమిటీలో ఉపాధ్యక్షులుగా పది మంది, ప్రధాన కార్యదర్శులుగా ఎనిమిది మంది, అధికార ప్రతినిధులుగా పదకొండు మంది, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా 34 మంది, కార్యదర్శులుగా 45మందిని నియమించారు. అలాగే ఓ కోశాధికారి, ఓ మీడియా కమిటీ కార్యదర్శి, ఓ పబ్లిసిటీ సెక్రటరీని నియమించారు.

మొత్తం 114 మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని, 105 మందితో ఏపీ రాష్ట్ర కమిటీని నియమించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి కళావెంకట్రావును ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో చంద్రబాబుతోపాటు ఏపీకి చెందిన అశోక్‌గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కావలి ప్రతిభా భారతి, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement