అడ్డొస్తే చంపేస్తా.. నేను చెప్పింది జరగాల్సిందే..!

TDP MLA Candidate Fire On YSRCP Leaders - Sakshi

టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్‌ ప్రభాకర్‌ వీరంగం 

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యం

సీఐ కోటేశ్వరరావును వెనక్కి నెట్టేసిన వైనం 

బాపట్ల: ‘అడ్డొస్తే చంపేస్తా..నేను చెప్పింది జరగాల్సిందే..ఎవరు నన్ను అడ్డుకునేదంటూ’ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం సతీష్‌ ప్రభాకర్‌ వీరంగం చేశారు. రెచ్చిపోయి చిందులు తొక్కుతున్న అన్నంను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పట్టణ సీఐ కోటేశ్వరరావును వెనక్కి నెట్టేసి మరీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపైకి అన్నం సతీష్‌ప్రభాకర్‌ దూసుకొచ్చారు. అన్నం దూకుడును కొద్దిసేపు పోలీసులు సైతం నిలువరించలేకపోయారు. బాపట్ల పట్టణంలోని చిల్లరగొల్లపాలెం వద్ద బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నివాసం ఉంది. ఈ బజారు మీదుగా ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ప్రచారానికి బయలు దేరారు.

ఎమ్మెల్యే నివాసం వద్ద డీజే ప్రచారరథం ఉంది. అయితే తమ ప్రచారం వస్తోందని, డీజే నిలుపుదల చేయాలంటూ తెలుగుతమ్ముళ్లు చిందులు తొక్కారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు శాంతియుతంగా సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా అన్నం సతీష్‌ జోక్యం చేసుకుని ‘ఏరా..ఎంత బలుపు’ అంటూ ఒక్కసారిగా వాహనం దిగి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల పైకి దూసుకురాబోయారు. ఇది గమనించిన పోలీసులు ఆయన్ను నిలువరించేందుకు యత్నించినప్పటికీ అన్నం ఆవేశం తగ్గలేదు. కొద్దిసేపు వీరంగం చేసి నానా రగడ చేశారు. అన్నం ఆగడాల్ని చూసి ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top