‘ఆయన ట్రాప్‌లో మీడియా సంస్థలు’.. | Sakshi
Sakshi News home page

‘ఆయన ట్రాప్‌లో పడ్డ కొన్ని మీడియా సంస్థలు’..

Published Thu, Mar 7 2019 3:56 PM

Talasani Srinivas Yadav Fires On Chandrababu Over IT Grid - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మిని చేయగలరని, ఆయన ట్రాప్‌లో పడిన కొన్ని మీడియా సంస్థలు కూడా తిమ్మిని బమ్మిని చేయాలనుకుంటున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌​ మండిపడ్డారు. ఐటీ గ్రిడ్‌కు సంబంధించిన వాస్తవాలు ప్రజల దృష్టికి తేవాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్‌ కేసును రెండు రాష్ట్రాల వివాదంగా కొందరు తెలిసీ, తెలియక చిత్రీకరిస్తున్నారన్నారు. ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయటం దౌర్భాగ్యమన్నారు. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కంకణం కట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కూడా 24 లక్షల ఓట్లను తొలగించి గెలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు.. దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కొన్ని సార్లు తమ డేటా చోరీ అయిందని, కొన్ని సార్లు కాలేదని టీడీపీ నేతలు పూటకో వైఖరితో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టు సంఘాలు ఒక కమిటీ వేసుకుని ఐటీ గ్రిడ్‌పై నిష్పాక్షికంగా విచారణ చేసి ప్రజలకు వాస్తవాలు చెబితే మంచిదని సూచించారు. ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను బలి చేయాలని చూస్తోందన్నారు. డేటా టీడీపీ సభ్యత్వానికి సంబంధించింది కాదని, అది ఏపీ ప్రజల డేటా అని లోకమంతటికి తెలుసునన్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పు చేసిన వారిని ఒప్పు చేసిన వారిగా చిత్రీకరిస్తున్నాయన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలను, మంత్రులను, వ్యవస్థలను చంద్రబాబు ముంచేస్తారన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం ఎవరికీ మంచిది కాదని సూచించారు.

Advertisement
Advertisement