బాలకృష్ణకు చేదు అనుభవం

Sour Experience To Nandamuri Balakrishna - Sakshi

సాక్షి, హిందూపురం: ఎన్నికల ప్రచారంలో అధికార టీడీపీ అభ్యర్థులను ప్రజలు అడగడుగునా నిలదీస్తున్నారు. ఐదేళ్లు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలయ్యకు స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చారని నిలదీశారు.

దీంతో కంగుతిన్న బాలకృష్ణ స్థానిక టీడీపీ నాయకులపై చిందులు తొక్కారు. ఇన్ని రోజులుగా సమస్య ఎందుకు పరిష్కరించలేదని మండిపడ్డారు. నియోజకవర్గానికి అతిథిలా వచ్చిపోయే బాలయ్య తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. కాగా, జర్నలిస్టులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేసి బాలకృష్ణ ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యం వివాదాలతో సావాసం చేసే బాలకృష్ణకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top