ఎమ్మెల్యేల బలం చూపిస్తూ సచిన్‌ వీడియో!

Sachin Pilot Team Release Video Of Showing 16 MLAs Strength - Sakshi

జైపూర్‌/ఢిల్లీ: అగ్రనేతల బుజ్జగింపులతో సచిన్‌ పైలట్‌ మెత్తబడ్డాడనే వార్తల్లో నిజమెంతో గానీ, అతని వెంట మాత్రం 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు సచిన్‌ పైలట్‌ అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి విడుదలైన వీడియో ద్వారా స్పష్టమవుతోంది. సోమవారం రాత్రి ఉన్న పైలట్‌ వర్గం గురుగ్రామ్‌లోని మానెసర్‌ హోటల్‌లో తమ క్యాంపు వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసింది. 10 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఇంద్రా గుర్జార్‌, ముఖేష్‌ భాకర్‌, హరీష్‌ మీనా, పీఆర్‌ మీనాను గుర్తించొచ్చు. అయితే, సచిన్‌‌ వీడియోలో కనిపించలేదు. టూరిజం మినిస్టర్‌ విశ్వేంద్ర సింగ్‌ ఈ వీడియోను ట్వీట్‌ చేశారు. ఫ్యామిలీ అని క్యాప్షన్‌ పెట్టారు.

లాదూన్‌ ఎమ్మెల్యే ముఖేష్‌ భాకర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘కాంగ్రెస్‌లో విధేయత అంటే అశోక్ గహ్లోత్‌ బానిసత్వంఅన్ని అన్నారు. అది మాకు ఆమోదయోగ్యం కాదు’అని పేర్కొన్నారు. ఇక సోమవారం మధ్యాహ్నం జరిగిన కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) భేటీకి సచిన్‌ పైలట్‌ వర్గం హాజరుకాని సంగతి తెలిసిందే. మరోవైపు సీఎల్పీ భేటీలో 106 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని కాంగ్రెస్‌ ప్రకటించగా.. దానిని పైలట్‌ వర్గం నేతలు తప్పుబట్టారు. మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ఇంట్లో కాదని వ్యాఖ్యానించారు. అలాగే, పైలట్‌ బీజేపీలో చేరబోవడం లేదని వారు స్పష్టం చేశారు. 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే.. ఎమ్మెల్యేలను గవర్నర్‌ వద్దకు తీసుకువెళ్లాలి కానీ, రిసార్ట్‌కు కాదని  పైలట్‌ వర్గం నేతలు ఎద్దేవా చేశారు.
(చదవండి: గహ్లోత్‌ గట్టెక్కినట్టే!)

నేడు మళ్లీ సీఎల్పీ.. సచిన్‌కు ఆహ్వానం
కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేడు మరోసారి భేటీ కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్‌లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్‌నేత  సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్‌కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top