మాటల కత్తులు దూసి.. తొలిసారి ఎదురుపడ్డారు | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 13 2017 2:00 PM

PM Modi, Manmohan Singh's Handshake - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పూర్వ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బుధవారం పరస్పరం అభివాదం చేసుకున్నారు. 2001 పార్లమెంటుపై దాడిలో మృతిచెందిన అమరులకు నివాళి అర్పించేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు పరస్పరం ఎదురుపడ్డారు. పార్లమెంటుపై దాడి ఘటనలో తొమ్మిదిమంది అమరులైన సంగతి తెలిసిందే. వారికి నివాళులర్పించేందుకు పార్లమెంటు లోపల నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, మన్మోహన్‌సింగ్‌తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్లమెంటులోపలికి వెళుతున్న సమయంలో మోదీ, మన్మోహన్‌ పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా చేతులు జోడించి ఇద్దరూ అభివాదం చేసుకున్నారు. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, మన్మోహన్‌ మాటల కత్తులు దూసుకున్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పాకిస్థానీ అతిథులతో సమావేశమై.. గుజరాత్‌ ఎన్నికల గురించి చర్చించారని, గుజరాత్‌ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలు తీవ్ర దుమారంరేపాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ విమర్శలను కొట్టిపారేసింది. మోదీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు పరస్పరం ఎదురుపడటం, మర్యాదపూర్వకంగా అభివాదాలు చేసుకోవడం గమనార్హం. ఇక గుజరాత్ ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం నిర్వహించిన రాహుల్‌ గాంధీని ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పలుకరించడం కనిపించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌కు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కరచాలనం చేసి గ్రీటింగ్స్‌ తెలిపారు.

Advertisement
Advertisement