Pawan Kalyan Tweets Today: 10 కోట్లిచ్చి మరీ మా అమ్మను తిట్టించారు - Sakshi
Sakshi News home page

శ్రీరెడ్డి వివాదం; సంచలనం రేపిన పవన్‌

Apr 20 2018 9:37 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Sensational Comments On Sri Reddy Issue And Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గడిచిన కొద్దిరోజులుగా తీవ్రదుమారం రేపుతోన్న శ్రీరెడ్డి వివాదంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధంలేని వ్యవహారంలోకి తనను లాగిందేకాక, తనపై, తన కుటుంబంపై అత్యాచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జరిగిన ఘటనలకు సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. నారా లోకేశ్‌, టీడీపీ అనుకూల మీడియా దారుణమైన కుట్రలు చేసిందని, 10 కోట్ల రూపాయలు ఇచ్చిమరీ తన మాతృమూర్తిని తిట్టించారని పవన్‌ ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్లు దుమారంరేపుతున్నాయి.

నా కుటుంబంపై అత్యాచారం చేస్తున్నారు: ‘‘ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి అండగా నిలబడ్డ నాకు చంద్రబాబు నాయుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చారు. సచివాలయం వేదికగా లోకేశ్‌, అతని సన్నిహితుడు, అనుకూల టీవీచానెల్స్‌తో కలిసి నా కుటుంబంపై ఆరు నెలలుగా నిరవధిక అత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒకటే.. కొడుకుగా కన్నతల్లిని కాపాడుకోలేనప్పుడు చావడమే నయం. ఈ రోజు నుంచి ఏ క్షణమైనా చావడానికి సిద్ధపడి ముందుకు వెళుతున్నాను’’ అని పవన్‌ తెలిపారు.

డబ్బులిచ్చింది వీళ్లే: దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, భర్త, పిల్లలే ప్రపంచంగా జీవించి, ఎవరికీ అపకారం చేయని తన మాతృమూర్తిపై కొందరు వ్యక్తులతో దారుణంగా తిట్టించారని, అలా తిట్టడానికి రూ.10 కోట్లు ఇచ్చారని, దర్శకుడు వర్మ, ప్రముఖ చానెల్‌ యజమాని, దాని నిర్వాహకుడు, నారా లోకేశ్‌, అతని స్నేహితులు కలిసి చేస్తోన్న దారుణాలు చంద్రబాబుకు తెలియదంటే నమ్మాలా? అని పవన్‌ పేర్కొన్నారు.

హోదా కంటే ‘వ్యభిచారమే’ ముఖ్యమా?: అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు చేస్తోన్న కుట్రలను విమర్శించే క్రమంలో పవన్‌ అతితీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ సీఎం చంద్రబాబు గారు.. ప్రత్యేక హోదా సాధన కంటే.. పచ్చ చానెళ్లు చేస్తోన్న వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించడంపైనే మీరు ఎక్కువ శ్రద్ధపెట్టారు. అసలు మీ ఉద్దేశం ఏమిటి?’’ అని పవన్‌ నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement