
రాజకీయాల్లో ఎదగాలంటే కనీసం 25 ఏళ్లు ఓపిక పట్టాలని..
సాక్షి, విజయవాడ : ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి మెగాస్టార్ చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను ఒకడినని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఓపిక లేని నాయకులు పార్టీలో చేరడం వల్లే ప్రజారాజ్యం విఫలమైందని అభిప్రాయపడ్డారు. శనివారం పలు జిల్లా సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలను పరిష్కరించే ఓపిక కూడా నేతల్లో లేదన్నారు.
ప్రజారాజ్యం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కమిటీల నియమకాల విషయంలో తొందరపడలేదన్నారు. రాజకీయాల్లో ఎదగాలంటే కనీసం 25 ఏళ్లు ఓపిక పట్టాలని, వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 60 శాతం మంది కొత్తవారిని బరిలోకి దింపుతున్నట్లు పేర్కొన్నారు.