‘అధికారం కత్తిరించినా అహంకారం తగ్గలేదు’
కేశినేని నాని క్షమాపణ చెప్పాలి: నాయీ బ్రాహ్మణులు
సాక్షి, విజయవాడ : నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యానాదయ్య డిమాండ్ చేశారు. ఎంపీ నాని నాయి బ్రాహ్మణలు కులాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం విజయవాడలో నాయిబ్రాహ్మణలు ఆందోళన చేపట్టారు. నాని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. నానిని టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి నానిని సస్పెండ్ చేయకుంటే చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ కులాలను అవమానించిన చంద్రబాబుపైన కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులకు అధికారం కత్తిరించినా అహంకారం తగ్గలేదని విమర్శించారు. గతంలో తమ తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబుకు ఎన్నికల్లో ఆయన తోక కత్తిరించినా సిగ్గు రాలేదని విరుచుకుపడ్డారు. ‘తమతో పెట్టుకుంటే పిల్లిబొచ్చు కాదు నీ నాలుక కత్తిరిస్తాం జాగ్రత్త..’ అంటూ కేశినేని నానిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
నాయిబ్రాహ్మణ నంద యువసేన అధ్యక్షుడు ఇంటూరి బాబ్జి మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా వాఖ్యలు చేసిన కేశినేని నానిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయిబ్రాహ్మణలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెంటనే ఎంపీ నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేశినేనిపై కడప డీఎస్పీకి ఫిర్యాదు
తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాయిబ్రాహ్మణ సంఘం నాయకుడు యానాదయ్య బుధవారం కడప డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేశినేని నానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో తమను సచివాలయంలో బహిరంగంగా దూషించారని నాయిబ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.