
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖపట్నంలో సోషల్ ఎకో సిస్టం లేదు.. డైరెక్ట్ ఫ్లైట్లు లేవు.. అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూళ్లూ లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను వదిలి విశాఖ రావడానికి ఐటీ కంపెనీల వారు సిద్ధంగా లేరు’ అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆయన విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానిక కోటా కుదరదన్నారు. అలాంటి కోటా ఉంటే ఏ సంస్థలూ ముందుకు రావని చెప్పారు.
విశాఖలో 2014కి ముందు కేటాయించిన స్థలాల్లో కొన్ని ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించలేదని, వాటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్ యూనిట్ల ఏర్పాటులో తిరుపతి క్లస్టర్పై ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారని, సెల్ఫోన్ల తయారీ క్లస్టర్గా తిరుపతి అభివృద్ధి చెందుతోందన్నారు. కాగా, విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సదస్సు మంగళవారం ముగిసింది.