
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలు పాత టీమ్నే నమ్ముకున్నారు. అంటే, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుజరాత్, ఇతర రాష్ట్రాల్లో పార్టీకి విజయం సాధించి పెట్టిన పది మంది టీమ్నే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎంపిక చేసుకున్నారు. వారిలో కేంద్ర మంత్రులతోపాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించినంత సులువు ఈసారి కాదనే విషయం మోదీ, అమిత్ షాలకు బాగా తెలుసు. అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి స్వయంగా నరేంద్ర మోదీ అవడం వల్లనే విజయం సులువైంది.
ఈసారి కూడా రాష్ట్రంలో ఎలాగైనా విజయం సాధించి తీరాలనే ఉద్దేశంతో 2014లో పార్లమెంట్ ఎన్నికలకు చర్యలు తీసుకున్న స్థాయిలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా తీసుకుంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ సీట్లను నాలుగు జోన్లుగా విభజించి కేంద్ర మంత్రులకు అప్పగించారు. నరేంద్ర సింగ్ తోమర్కు గుజరాత్ సెంట్రల్, అహ్మదాబాద్లోని 50 సీట్లను అప్పగించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్కు సూరత్లో 36 సీట్లు, వెస్ట్జోన్లో 45, ఈస్ట్జోన్లో 42 సీట్లను అప్పగించారు. రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది పార్టీ కార్యకర్తలు, 58 వేల మంది బూతుస్థాయి ప్రచారకుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని మోదీ, అమిత్ షాలతో ఎప్పటికప్పుడు సమీక్షించి ఎప్పటికప్పుడు వ్యూహాలను అనుసరించే బాధ్యతను ఆర్గనైజేషన్ ఇంచార్జి భికూభాయ్ దస్లానియాకు అప్పగించారు. దస్లానియా 2004 నుంచి ఆర్గనైజేషన్ ఇంచార్జిగా పనిచేస్తున్నారు. ఆయన రెండు పార్లమెంట్, పలు అసెంబ్లీ ఎన్నికలకు బాధ్యత వహించారు.
సోషల్ మీడియాలో ప్రచారానికి ఎప్పటికప్పుడు వ్యూహరచన చేసే బాధ్యతను పార్టీ గ్లోబల్ కన్వీనర్ చౌతాయ్వాలాకు అప్పగించారు. ఆయన పంకజ్ శుక్లాతో కలసి 2014 నుంచి మోదీ వద్ద సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్నారు. ఆయన మోదీకి, అమిత్ షాకు చాలా సన్నిహితుడు. ఆయన పార్టీ నేషనల్ మీడియా హెడ్ సంజయ్ మయూక్, పార్టీ సెట్రటరీ జనరల్ భూపేంద్ర యాదవ్తో కలసి మీడియా మేనేజ్మెంట్ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఇక 182లో అసెంబ్లీ సీట్లలో పార్టీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆ బాధ్యతను పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ అనిల్ జైన్కు అప్పగించారు. ఎక్కడ, ఎప్పుడు ముఖ్యమంత్రులు లేదా మంత్రుల బహిరంగ సభలను ఏర్పాటు చేయాలి? ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ర్యాలీలు నిర్వహించాలనే అంశంపై నిర్ణయించే బాధ్యత పూర్తిగా ఆయనదే.
ఇక పార్టీ అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యతను రామ్లాల్, భూపేంద్ర యాదవ్లకు అప్పగించారు. అమిత్ షా వీరందరి మధ్య సమన్వ బాధ్యతలు పర్యవేక్షించడంతోపాటు ముఖ్యమంత్రి విజయ్ రుపానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి నితిన్భాయ్ పటేల్ చేత సభలు, సమావేశాలు నిర్వహించడంలో తలమున్కలై ఉన్నారు.