‘చంద్రబాబు చేతిలో నిలువునా మోసపోయా’

MLA David Raju Fires On Chandrababu Naidu - Sakshi

యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు ఫైర్‌

సాక్షి, ఒంగోలు : మాయ మాటలు నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో నిలువునా మోసపోయానని యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు ఫైర్‌ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని.. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తానని నమ్మించి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం డేవిడ్‌ రాజు.. మీడియాతో మాట్లాడుతూ.. అన్నదమ్ముల్లా ఉండే మాల-మాదిగల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో మాదిగలు సభలు జరుపుకోకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎంఆర్పీఎస్‌ సభ అనుమతివ్వమని స్వయంగా తానే చంద్రబాబును కోరానని, ఇచ్చే ప్రసక్తేలేదని తనపై సీరియస్‌ అయ్యారని తెలిపారు.

అనంతరం ఐబీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర రావుని కలిసి మాదిగల సభకు అనుమతి అడిగానన్నారు. ఆయన రాజకీయనాయకుడిలా వ్యవహరిస్తూ.. టీడీపీ నాయకుడిలా ఏమి చేప్తే అదే చేశారన్నారు. తన దగ్గర డబ్బులేదనే టీడీపీ టికెట్‌ ఇవ్వలేదని, సామాన్యులకు టికెట్‌ ఇచ్చే గొప్ప వ్యక్తి వైఎస్‌ జగనని కొనియాడారు. అందుకు నిదర్శనం బాపట్ల పార్లమెంట్‌కు పేదవాడైన నందిగం సురేశ్‌కు టికెట్‌ ఇవ్వడమేనన్నారు. నందిగం సురేశ్‌కు మద్దతు తెలుపుతూ.. బాపట్ల లోక్‌సభకు తాను స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. నందిగం సురేశ్‌ విజయానికి, వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడానికి కార్యకర్తలా కృషి చేస్తానన్నారు.

ఎమ్మెల్యేను చేసిన పార్టీ కాదని టీడీపీలో చేరి పెద్ద తప్పుచేశానని పశ్చాతాపం వ్యక్తం చేస్తూ డేవిడ్‌ రాజు మంగళవారం తిరిగి వైఎస్సార్‌ సీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ మారి చేసిన తప్పుకు క్షమించాలని డేవిడ్‌ రాజ్‌ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను కోరారు.
చదవండి : తప్పు చేశా.. క్షమించండి !

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top