
కోల్కతా: తీవ్ర వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ‘పద్మావతి’ చిత్ర యూనిట్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. పద్మావతి దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ, ఆ చిత్ర యూనిట్ను బెంగాల్క ఆహ్వానించారు. పద్మావతి సినిమాను పలు రాష్ట్రాలు నిషేధిస్తున్నా నేపథ్యంలో ఈ సినిమాను సాదరంగా స్వాగతిస్తామని, తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆమె ప్రకటించారు.
‘వాళ్లు వేరే ఏ రాష్ట్రంలో సినిమాను విడుదల చేయలేకపోతే.. మా రాష్ట్రానికి రండి. మేం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఇందుకు బెంగాల్ గర్వపడుతుంది. సంతోషిస్తుంది’ అని మమత ఇండియా టుడే ఈస్ట్ సదస్సులో పేర్కొన్నారు. రాజ్పుత్ వర్గీయుల ఆందోళనలు, బెదిరింపులతో ‘పద్మావతి’ సినిమా విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
మోదీ ఒక తుగ్లక్..!
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. మోదీని తుగ్లక్గా ఆమె అభివర్ణించారు. బెంగాల్లో పెట్టుబడులు పెట్టనివ్వకుండా వ్యాపారవేత్తలను మోదీ ప్రభుత్వం భయపెడుతుందని ఆరోపించారు. దేశంలో సహకార సమాఖ్యవాదం లేదని, సూపర్ ఎమర్జెన్సీ నడుస్తున్నదని మండిపడ్డారు. మీడియాను సైతం మోదీ ప్రభుత్వం నియంత్రిస్తున్నదని, దేశంలో భావప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆమె విమర్శించారు.