ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించే ఎనిమిది సీట్లు!

lok sbha election results reflect on 8 seats in madhya pradesh - Sakshi

జనాభిప్రాయానికి అద్దం ఈ ఎనిమిది సీట్లు

దళిత, ఆదివాసీ ప్రాంతాల్లో పోలింగ్‌

2014లో ఈ స్థానాలు బీజేపీ కైవసం

మధ్యప్రదేశ్‌ చివరి దశ కీలకం

మధ్యప్రదేశ్‌ చివరి దశ కీలకం
లోక్‌సభ ఎన్నికల చివరి దశలో మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. దళితులు, ఆదివాసీల జనాభా అధికంగా ఉన్న ఈ స్థానాలు రాజస్తాన్, మహారాష్ట్ర వైపు ఉన్న మాల్వా–నిమాఢ్‌ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఎనిమిది సీట్లలో రెండింటినీ ఎస్సీలకు, మూడింటిని ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు.  

ఎస్సీ సీట్లు: దేవాస్, ఉజ్జయిన్, ఎస్టీ సీట్లు: రత్నామ్, ధార్, ఖర్గోన్‌. మిగిలిన మందసోర్, ఇండోర్, ఖండ్వా జనరల్‌ స్థానాలు. 2014 ఎన్నికల్లో ఈ 8 సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. 2018 చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలోని 66 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 2013లో 56 గెలుచుకుంది. 2018లో 21 సీట్లలోనే విజయం సాధించింది. కాంగ్రెస్‌ తన బలాన్ని 9 నుంచి 35 సీట్లకు పెంచుకోగలిగింది. ఈ ప్రాంతం దేశ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందనే పేరుంది. 2009 ఎన్నికల్లో ఇక్కడి 8 సీట్లలో  ఆరు గెలుచుకున్న కాంగ్రెస్‌ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు రెండు సీట్లే గెలిచిన బీజేపీ 2014 ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ గెలిచి ఢిల్లీలో గద్దెనెక్కింది. సిట్టింగ్‌ సభ్యులపై ప్రజా వ్యతిరేకత కారణంగా బీజేపీ ఈ ఎనిమిది సీట్లలో ఐదు చోట్ల కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది.  

ఇండోర్‌లో ‘తాయి’ లేని ఎన్నికలు
1989 నుంచీ వరుసగా 8 సార్లు ఇండోర్‌ నుంచి గెలిచిన లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ (తాయి) తనకు 76 ఏళ్లు నిండాయంటూ పోటీకి దిగలేదు. నగరానికి చెందిన మరో బడా నేత కైలాస్‌ విజయవర్గీయ కూడా ఎన్నికల బరిలో లేకపోవడంతో ‘తాయి(సుమిత్ర), భాయీ(కైలాస్‌)’ లేని ఎన్నికలని జనం అనుకుంటున్నారు. బీజేపీ టికెట్‌పై సింధీ వర్గానికి చెందిన శంకర్‌ లాల్వాణీ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పంకజ్‌ సంఘ్వీ పోటీ చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణ్‌ పటేల్‌పై 4 లక్షల 66 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో సుమిత్రా మహాజన్‌ గెలిచారు. రైతుల రుణ మాఫీ ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. ఎన్నికల హామీ ప్రకారం అధికారం చేపట్టిన పది రోజుల్లో కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ సర్కారు రుణ మాఫీ చేయలేదని బీజేపీ అభ్యర్థి లాల్వాణీ ప్రచారం చేశారు. రుణ మాఫీ సక్రమంగా జరగకపోవడంతో కాంగ్రెస్‌ ఇబ్బంది పడుతుండగా, కొత్త అభ్యర్థి కావడంతో లాల్వాణీ విస్తృతంగా ప్రచారం చేయాల్సివచ్చింది. రెండుసార్లు నామినేషన్‌ వేసిన బీజేపీ అభ్యర్థి తరఫున సుమిత్రా మహాజన్‌ ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇండోర్‌ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ సుమిత్రా తాయి మాత్రమే తనను మందలించగలరని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత ఎలాగైనా ఇండోర్‌ సీటు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.  

ఖండ్వాలో పాత ప్రత్యర్థుల మధ్య పోటీ
ఖండ్వాలో సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ నంద్‌కుమార్‌ చౌహాన్, కాంగ్రెస్‌ అభ్యర్థి అరుణ్‌ యాదవ్‌ మధ్య మరోసారి ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. 2014లో యాదవ్‌ను 2 లక్షల 59 వేలకు పైగా ఓట్లతో చౌహాన్‌ ఓడించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన యాదవ్‌ 2009లో అప్పటికి నాలుగుసార్లు గెలిచిన చౌహాన్‌ను ఓడించారు. మారిన పరిస్థితుల్లో యాదవ్‌కు గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. మన్మోహన్‌ కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి సుభాష్‌ యాదవ్‌ కూడా గతంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఎస్టీ రిజర్వ్‌ సీటైన ఖర్గోన్‌ నుంచి 2007 ఉప ఎన్నికలో అరుణ్‌ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

దేవాస్‌లో కాంగ్రెస్‌ టికెట్‌పై కబీర్‌  దోహాల గాయకుడు
ఎస్సీలకు కేటాయించిన మరో లోక్‌సభ స్థానం దేవాస్‌. కబీర్‌దాస్‌ దోహాలు పాడుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ప్రహ్లాద్‌సింగ్‌ టిపానియా కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేస్తున్న కారణంగా దేవాస్‌ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిట్టింగ్‌ సభ్యుడు మనోహర్‌ ఉంత్వాల్‌కు బదులు మాజీ సివిల్‌ జడ్జి మహేంద్రసింగ్‌ సోలంకీకి బీజేపీ టికెట్‌ ఇచ్చింది. 64 ఏళ్ల టిపానియా కబీర్‌ కవితలు పాడుతూ ఎన్నికల సభల్లో ప్రజలను అలరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మోదీ సర్కారు సాధించిన విజయాల గురించి వివరిస్తూ జడ్జిగా కన్నాఎంపీగా ఎక్కువ మందికి సేవచేయగలనని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడు ఉంత్వాల్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి సజ్జన్‌సింగ్‌ వర్మను ఓడించారు. ఈ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న బలాయీ దళిత కులానికి చెందిన టిపానియా, సోలంకీ మధ్య పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి.  

ఉజ్జయినీలో బీజేపీ కొత అభ్యర్థి ఫిరోజియా
ఎస్సీలకు రిజర్వ్‌ చేసిన ఉజ్జయినీలో బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడు చింతామణి మాల్వీయాకు బదులు ఈసారి అనిల్‌ ఫిరోజియాను బరిలోకి దింపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కొత్త బీజేపీ నేతకు అవకాశమిచ్చారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రేంచంద్‌ గుడ్డూపై మాల్వీయా 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాంగ్రెస్‌ టికెట్‌పై ఈసారి బాబూలాల్‌ మాల్వీయా పోటీచేస్తున్నారు. బీజేపీ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్‌ తరఫున ప్రియాంకాగాంధీ ఉజ్జయినీలో ప్రచారం చేశారు.

మూడు ఎస్టీ సీట్లలో హోరాహోరీ
ఆదివాసీలకు రిజర్వ్‌ చేసిన రత్నామ్, ధార్, ఖర్గోన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ కంచుకోట రత్నామ్‌లో 2015 ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి కాంతిలాల్‌ భురియా విజయం సాధించారు. మళ్లీ 2019లో పోటీచేస్తున్న భురియాపై బీజేపీ తరఫున గుమన్‌సింగ్‌ డామోర్‌ పోటీకి దిగారు. కిందటి ఎన్నికల్లో బీజేపీ నేత దిలీప్‌సింగ్‌ భురియా గెలిచారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య చేతులు మారే స్థానం ధార్‌. ఇక్కడ బీజేపీ సిట్టింగ్‌ సభ్యురాలు సావిత్రీ ఠాకూర్‌కు బదులు ఛతర్‌సింగ్‌ దర్బార్‌ను పోటీలో నిలిపింది. ఆయన గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచి గెలిచారు. కాంగ్రెస్‌ టికెట్‌పై దినేశ్‌ గిర్వాల్‌లో బరిలోకి దిగారు. ఈ స్థానంలో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఖర్గోన్‌లో కూడా బీజేపీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపింది. గజేంద్ర పటేల్‌ (బీజేపీ), గోవింద్‌ ముజాల్దా(కాంగ్రెస్‌)   మధ్య గట్టి పోటీ ఉంది.

మంద్‌సోర్‌ శూరులెవ్వరో?
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సోర్‌లో ఆరుగురు రైతులు మరణించిన రెండేళ్ళ అనంతరం ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందకపోవడం ఈ ఎన్నికల్లో తిరిగి చర్చనీయాంశంగా మారింది. నెత్తురోడిన రైతు కుటుంబాలు ఈ ఎన్నికల్లో బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా మారింది. మంద్‌సోర్‌ లోక్‌సభ స్థానం బీజేపీ జనసంఘ్‌కి బలమైన ప్రాంతం. బీజేపీ లక్ష్మినారాయణ పాండే 8 సార్లు ఈ లోక్‌సభ స్థానం నుంచి విజయపరంపరని కొనసాగించారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ బీజేపీని ఓడించి,  ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నా, తరిగి బీజేపీ సుధీర్‌ గుప్తా 2014లో ఈ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేశారు. తిరిగి ఈ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ నుంచి మీనాక్షి నటరాజన్‌ బరిలోకి దిగారు.

బీజేపీ అభ్యర్థి సుధీర్‌ గుప్తా అభివృద్ధి మంత్రంతో జనంలోకి వెళ్ళారు. మంద్‌సోర్‌ లోక్‌సభ స్థానంలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లున్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లల్లో ఏడింటిని కైవసం చేసుకోవడం విశేషం. అయితే ఒక్క సీటు మినహా ఆరు సీట్లలో ఈ రెండు పార్టీల మధ్య కేవలం 2000 ఓట్ల తేడానే ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఓటింగ్‌ శాతం పెరిగితే అది బీజేపీకి అనుకూలించవచ్చుననీ, లేదంటే కాంగ్రెస్‌కి గెలుపు అవకాశాలుంటాయనీ, రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఏదిఏమైనా ఇక్కడ కాంగ్రెస్‌ బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top