ఏపీలో పెడబొబ్బలు పెట్టి.. ఢిల్లీలో ఎందుకలా? | Kolusu ParthaSarathy Slams Chandrababu And TDP | Sakshi
Sakshi News home page

ఏపీలో పెడబొబ్బలు పెట్టి.. ఢిల్లీలో ఎందుకలా?

Jun 19 2018 5:02 PM | Updated on Aug 20 2018 6:07 PM

Kolusu ParthaSarathy Slams Chandrababu And TDP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, అందుకే బడుగు బలహీనవర్గాలపై విరుచుకుపడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ చాలా ప్రచారం చేసుకుందని, ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం ఏమని నిలదీశారో టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు ఢిల్లీలో మీడియాకు ముఖం చాటేశారని గుర్తుచేశారు. ప్రతి తెలుగువాడు తలదించుకునేలా ప్రధాని మోదీకి వంగి వంగి చంద్రబాబు దండాలు పెట్టారంటూ మండిపడ్డారు.

నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన 8 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు తీరు దారుణమన్నారు. హామీల గురించి అడిగితే వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగుతారా.. ? దేశంలోనే అత్యంత సీనియర్‌ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు గతంలో మత్స్యకారులపై కూడా ఇలానే ప్రవర్తించారని చెప్పారు. హక్కుల కోసం పోరాడితే తోలు తీస్తాం, తోక కట్‌ చేస్తాం అనడం సమంజసమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై పుస్తకం వేసి దేశంలోని అన్ని పార్టీలకు, నేతలకు అందజేస్తామని పార్థసారధి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement