నియంత పాలనకు చరమగీతం పాడాలి | Kodandaram fires on KCR Govt | Sakshi
Sakshi News home page

నియంత పాలనకు చరమగీతం పాడాలి

Oct 2 2018 2:37 AM | Updated on Jul 29 2019 2:51 PM

Kodandaram fires on KCR Govt - Sakshi

కరీంనగర్‌: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అవినీతి ఏరులై పారుతోందని, అమరవీరుల ఆశయాలకు భిన్నంగా పాలన సాగుతోందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో సర్కస్‌గ్రౌండ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన అమరుల ఉద్యమ ఆకాంక్షల ధూంధాం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ సమాజాన్ని దగా చేసిన పాలకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలను జాగృతం చేయడమే లక్ష్యంగా ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇది ఆరంభమేనని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ప్రజాస్వామ్య పదాలను ప్రజలకు అందకుండా చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని విమర్శించారు.  

టీఆర్‌ఎస్‌ పతనానికి నాంది కావాలి
‘గల్ఫ్‌ బాధితులు గోసలు పోలె, నీళ్ల కోసం పోరాటాలు, ఆరాటాలు నడుస్తూనే ఉన్నాయి. ఉద్యోగాల ఊసేలేదు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల హామీ బుట్టదాఖలైంది. అమరవీరు ల స్మృతి వనం అందని ద్రాక్షగా మారింది’ అని కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన సర్కస్‌గ్రౌండ్‌ నుంచే ధూంధాం ప్రారంభమైందని.. టీఆర్‌ఎస్‌ పతనానికి నాంది కావాలని పిలుపునిచ్చారు. ధూంధాం కార్యక్ర మానికి ముందు కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యమ ఎజెండాపైనే ఇప్పటిదాకా కూటమిలోని పార్టీలు చర్చించాయని.. సీట్లపై ఇంకా చర్చ జరగలేదని, కేవలం ఉమ్మడి ఎజెండా మాత్రమే ఖరారైందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement