
అది సాధించటం ఎవరికీ సాధ్యకాలేదని...
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం చారిత్రక ఘట్టమని వైఎస్సార్ సీపీ నాయకురాలు కిల్లి కృపారాణి వ్యాఖ్యానించారు. 50శాతం ఓట్ షేర్ సాధించటం ఎవరికీ సాధ్యంకాలేదని పేర్కొన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కుటుంబం పట్ల ఉన్న జనాధరణకు ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ రోగులకు 10వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం హర్షణీయమన్నారు. మద్యం అమ్మకాల నియంత్రణకు, బెల్ట్ షాప్ల నిర్మూలన పట్ల ప్రకటన చేయడం అభినందనీయమన్నారు.
అవినీతి రహిత సమాజానికి సీఎం వైస్ జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని కోరారు. జన్మభూమి కమిటీల మాఫీయాకు చరమగీతం పాడి, సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇస్తామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల నియామకం ద్వారా లక్షా అరవైవేల మందికి ఉపాధి లభించనున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఏపీ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి బుద్ధి చెప్పారన్నారు.