విశాఖ విమానాశ్రయంలో కేసీఆర్‌కు ఘనస్వాగతం | Sakshi
Sakshi News home page

విశాఖపట్నంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌..

Published Sun, Dec 23 2018 11:12 AM

KCR Federal Front Tour Starts.. visits Visakhapatnam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా శారదాపీఠానికి బయలుదేరారు. సీఎం హోదాలో తొలిసారి విశాఖపట్నం వచ్చిన కేసీఆర్‌.. శారదా పీఠాన్ని సందర్శించి..  స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన విశాఖ నుంచి భువనేశ్వర్‌ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌,  తన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా కేసీఆర్‌ వరుసగా ఐదు రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మహమూద్‌ అలీ దట్టీ కట్టి.. సాదరంగా వీడ్కోలు పలికారు. విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించిన అనంతరం ఆయన భువనేశ్వర్‌ వెళ్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆయన నివాసంలోనే సమావేశమవుతారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే కేసీఆర్‌ బస చేస్తారు. సోమవారం సైతం ఒడిశాలోనే ఉంటారు. కోణార్క్, పూరీ దేవాలయాలను సందర్శించి సాయంత్రం కోల్‌కతా వెళ్తారు.  

విశాఖలో భారీ కేసీఆర్‌ కటౌట్లు
తెలంగాణ సీఎం కేసీఆర్‌ విశాఖ పర్యటన నేపథ్యంలో శారదాపీఠం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలో భారీగా పోలీసులను మొహరించారు. తెలంగాణా పోలీసులు కూడా శారదాపీఠం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆశ్రమంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ విశాఖకు వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ.. విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వెళ్లే మార్గంలో భారీ కటౌట్లు వెలిశాయి. ఈ మార్గంలో వెలిసిన కేసీఆర్‌ కటౌట్లు పలువురు దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Advertisement
Advertisement