
ఎన్నికల షెడ్యూల్ను మీడియాకు వివరిస్తున్న సీఈసీ ఓపీ రావత్, కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావాసా
న్యూఢిల్లీ : కర్ణాటక యుద్ధానికి నగారా మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 224 శాసనసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. మే 12న ఒకే దశలో పోలింగ్ జరుగుతుందని, మే 15న ఫలితాలు వెలువడతాయని తెలిపింది. ఎన్నికల నిబంధనావళి తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఈ ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగిస్తామని, అన్ని ఈవీఎంలకు వీవీపీఏటీ (ఓటు రశీదు యంత్రం)లను అనుసంధానిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 24 వరకు గడువు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేంద్రం కావేరీ నీటి పంపిణీ బోర్డు ఏర్పాటు చేయడానికి ఎన్నికల నియమావళి అడ్డుకాబోదని తెలిపారు.
మరోవైపు, ఈసీ నుంచి ప్రకటన రాక ముందే బీజేపీ ఐటీ విభాగ అధిపతి అమిత్ మాలవీయ పోలింగ్ తేదీని ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ లీకేజీ ఘటనపై విచారణ జరిపేందుకు డిప్యూటీ ఈసీ ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది.
ఈసీ కన్నా ముందే చెప్పేశారు..
సీఈసీ ఓపీ రావత్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే కర్ణాటకలో పోలింగ్ మే 12న జరుగుతుందని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. అప్పటికి రావత్ పోలింగ్ తేదీని ప్రకటించకపోవడం గమనార్హం. పోలింగ్ తేదీని సరిగ్గానే తెలిపిన అమిత్.. ఓట్ల లెక్కింపు మే 18న నిర్వహిస్తారని ట్వీటర్లో తప్పుగా పేర్కొన్నారు. ఓ టీవీ చానెల్లో ప్రసారమైన వార్తనే తాను ఉటంకించానని తరువాత బదులిచ్చారు.
ఈ లీకేజీని తీవ్రమైనదిగా పరిగణిస్తున్నామని రావత్ చెప్పారు.ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి శ్రీవత్స కూడా దాదాపు అదే సమయంలో ఇలాంటి సమాచారాన్నే పోస్ట్ చేసినట్లు కొందరు నెటిజన్లు గుర్తించారు. శ్రీవత్స కూడా అమిత్ మాదిరిగానే పోలింగ్ తేదీని సరిగ్గానే ట్వీట్ చేసినా, ఓట్ల లెక్కింపు తేదీని తప్పుగా చెప్పారు.
ఈసీని కలిసిన బీజేపీ బృందం..
అమిత్ మాలవీయకు బీజేపీ మద్దతుగా నిలిచింది. ఓ టీవీ చానెల్లో వచ్చిన వార్తా కథనం ఆధారంగానే ఆయన పోలింగ్ తేదీని ట్వీట్ చేసినట్లు ఈసీకి వివరించింది. కాంగ్రెస్ నాయకుడు కూడా ఒకరు ఇదే సమాచారాన్ని ట్వీటర్లో ఉంచిన విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.
పోలింగ్ తేదీ లీకేజీని సీఈసీ రావత్ తీవ్రమైన విషయంగా పేర్కొన్న తరువాత కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలో బీజేపీ బృందం ఎన్నికల సంఘాన్ని కలుసుకుంది. కర్ణాటకలో పోలింగ్ జరిగే తేదీని ఉదయం ఓ టీవీ చానెల్ పేర్కొన్న తరువాతే తాను ఈ విషయాన్ని ట్వీట్ చేశానని ఈసీకి సమర్పించిన లేఖలో అమిత్ తెలిపారు. ఆ చానెల్ స్క్రీన్ షాట్లు, తన ట్వీట్, కాంగ్రెస్ నాయకుడి ట్వీట్, ఆ ట్వీట్లు చేసిన సమయాలు తదితరాలన్నింటిని కూడా ఈసీకి అందించారు.
బీజేపీ.. సూపర్ ఎలక్షన్ కమిషన్: కాంగ్రెస్
కర్ణాటక పోలింగ్ తేదీ ముందుగానే బహిర్గతం కావడంపై స్పందించిన కాంగ్రెస్.. బీజేపీ సూపర్ ఎలక్షన్ కమిషన్గా వ్యవహరిస్తోందని మండిపడింది. ఈసీ విశ్వసనీయతకు ఇది పరీక్షా కాలమని, బీజేపీ, ఆ పార్టీ చీఫ్ అమిత్ షాపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించింది.
ఓటర్లు సుమారు 5 కోట్ల మంది..
ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు.
దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్ సిబ్బందిగా ఉపయోగించుకోవడంతో పాటు కొన్ని చోట్ల అందరూ మహిళా సిబ్బందే(సుమారు 450 మంది) విధులు నిర్వర్తించే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల ఇతివృత్తంతో సంగీత దర్శకుడు యోగ్రాజ్ భట్ ఓ గీతాన్ని విడుదల చేయనున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య 9 శాతం పెరిగింది. మొత్తం 4 కోట్ల 96 లక్షల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.