గుండేగాంపై ప్రభుత్వానికి పట్టింపేది? | DCC Maheshwar Reddy Slams On KCR | Sakshi
Sakshi News home page

గుండేగాంపై ప్రభుత్వానికి పట్టింపేది?

Jul 9 2018 1:05 PM | Updated on Aug 17 2018 2:56 PM

DCC Maheshwar Reddy Slams On KCR - Sakshi

మాట్లాడుతున్న మహేశ్వర్‌రెడ్డి

భైంసా(ముథోల్‌): గుండేగాం గ్రామస్తుల పునరావాసంపై ప్రభుత్వానికి పట్టింపులేదని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం భైంసాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్సికర్‌ రంగారావు ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే గుండేగాం, పాతమహాగాం, చింతల్‌బోరి గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిసినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గతేడాది గుండేగాం గ్రామంలోకి వరద నీరు చొచ్చుకువచ్చిందని, ఈఏడాది మళ్లీ అదే పరిస్థితి ఎదురైందన్నారు. అయినా.. అధికారుల్లో చలనంలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ముంపునకు గురయ్యే గ్రామాలు, నీట మునిగే పంటపొలాలను గుర్తించి పరిహారం చెల్లించాల్సిన కనీస బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

మూడు రోజులుగా గుండేగాం గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారని, గ్రామంలోకి పాములు, అడవి పందులు వస్తున్నాయన్నారు. గుండేగాం గ్రామస్తులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా ముంపు బాధితులు, పునరావాస గ్రామాల వారికి పరిహారం ఇప్పించడంలో విఫలమవుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రానున్నరోజుల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తీరుస్తామన్నారు. గుండేగాం గ్రామస్తులకు పునరావాసం కల్పించి నీటమునిగే పంటపొలాలకు పరిహారం చెల్లించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement