నేడు కాంగ్రెస్‌లోకి డీఎస్, నర్సారెడ్డి

D Srinivas and Narsa Reddy Will Join Congress Party Today - Sakshi

     రాహుల్‌ సమక్షంలో పార్టీ తీర్థం..

     అదే దారిలో రాములునాయక్‌

     నర్సారెడ్డికి మెదక్‌ సీటుకు హామీ?

     ఉత్తమ్‌తో మెదక్‌ పార్టీ నేతల భేటీ 

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తిరిగి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన సస్పెండైన నాటి నుంచే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్యంగా డీఎస్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. డీఎస్‌ స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్‌ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. పదవి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్‌ ఎంపీ స్థానంతో పాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.

ఈ సమయంలోనే ఆయన కుమారుడు అరవింద్‌ బీజేపీలో చేరటం, టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు చేయడంతో జిల్లా నాయకత్వం అంతా డీఎస్‌ను పార్టీ నుంచి తొలగించాలని అధినేతకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆనాటి నుంచి ఆయన కేసీఆర్‌పై మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఢిల్లీలో సంబంధాలున్న నేతలను కలసి తిరిగి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. హైకమాండ్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పెద్దలు ఆయనతో పలుమార్లు భేటీ నిర్వహించారు. ఇటీవల రాహుల్‌ కామారెడ్డి పర్యటన సందర్భంగానే డీఎస్‌ చేరిక ఉంటుందని భావించినా, ఆయన ఢిల్లీలోనే చేరేందుకు సుముఖత చూపారు. 

పలు భేటీల తర్వాత నర్సారెడ్డి.. 
గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ టి.నర్సారెడ్డి సైతం డీఎ స్‌తో పాటు రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. టీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నా ఆయన.. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద పలుమార్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన ఇటీవల భేటీ అయ్యారు. అయితే మంత్రి హరీశ్‌రావు స్వయంగా నర్సారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ గురువారం రాత్రి ఉత్తమ్‌తో మరోమారు సమావేశమైన ఆయన కాంగ్రె స్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయి శుక్రవారం ఉదయమే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డికి టికెట్‌ ఇప్పటికే ఖాయమైనందున నర్సారెడ్డికి మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ రాములు నాయక్‌ సైతం రాహుల్‌ సమక్షంలో కాం గ్రెస్‌లో చేరే అవకాశముంది. ఆయన శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

ఐతే విజయశాంతి.. లేదా స్థానికుడికే 
నర్సారెడ్డికి మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించనున్నారన్న వార్తల నేపథ్యంలో మెదక్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అలెర్టయ్యారు. సీనియర్‌ నేతలు సుప్రభాత్‌రావు, బట్టి జగపతి, చంద్రపాల్‌ తదితరులు శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను కలిశారు. ఇస్తే విజయశాంతికి టికెట్‌ ఇవ్వాలని, లేని పక్షంలో స్థానికులకే టికెట్‌ కేటాయించాలని కోరారు. కూటమిలోని మిగతా పక్షాలకు గానీ, స్థానికేతరులకు కానీ ఇవ్వరాదని విన్నవించారు. ఇదే విషయమై వీరంతా విజయశాంతిని సైతం కలసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 

కేసీఆర్‌ వ్యవహార శైలి నచ్చకనే..: నర్సారెడ్డి 
కేసీఆర్‌ వ్యవహార శైలి నచ్చకనే తాను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు నర్సారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతఎన్నికల్లో కేసీఆర్‌ చేతిలో ఓడినా ప్రజాసేవ చేయాలన్న తపనతో టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు.  ఆయన వద్ద తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేకపోయిందన్నారు. ఆయన తీరు నచ్చకే రహదారులు అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ఈలోపే పార్టీ నుంచి  సస్పెండ్‌ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజాసేవ కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు. గజ్వేల్‌ నుంచి కాంగ్రెస్‌ ఎవరికి టికెట్‌ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.  

కృష్ణయ్య, తుల ఉమ కూడా? 
ఎల్బీనగర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్‌.కృష్ణయ్య, కరీంనగర్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.  వేములవాడ నుంచి  టికెటు హామీ ఇస్తే ఉమ చేరే అవకాశముందని సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top