చిత్తూరులో పోలీసుల ఓవరాక్షన్‌.. చెవిరెడ్ది భార్య అరెస్ట్‌

Chevireddy Bhaskar Reddy Fires On CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని అదివారం అర్థరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెవిరెడ్డితో సహా సుమారు 100మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి, రాత్రంతా పలు ప్రాంతాల్లో తిప్పి...చివరకు తెల్లవారుజామున సత్యవీడు పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. చెవిరెడ్డిపై ఐదు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీసుల దౌర్జన్యం, ప్రభుత్వ అరాచకానికి నిరసనగా చెవిరెడ్డి పీఎస్‌లోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. (సీఎం సొంత జిల్లాలో పోలీసుల అరాచకం)

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సత్యవీడు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తరలివచ్చి ఆందోళనకు దిగారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ ఆయన సతీమణి లక్ష్మీ దీక్షకు దిగారు. దీంతో పోలీసులు మరో సారి అత్యుత్సాహం ప్రదర్శించి లక్ష్మీతో సహా మరో 200 మంది మహిళలను అరెస్ట్‌ చేశారు. మహిళలను బలవంతంగా లాక్కెల్లి దీక్ష భగ్నం చేశారు. చెవిరెడ్డి భార్య లక్ష్మీతో పాటు శోభ అనే మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ సందర్భంగా జరిగిన తోపులాటలో శోభకు గాయాలయినట్లు తెలుస్తోంది. శోభ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మరో నాలుగు జీపుల్లో మిగతా మహిళలను వేరు వేరు ప్రాంతాలకు తరలించారు. కాగా చెవిరెడ్డి భార్య లక్ష్మీని పీఎస్‌కు తరలించకుండా పలు ప్రాంతాలకు తిప్పుతున్నారు.

పోలీసులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు : చెవిరెడ్డి
దీక్షకు దిగిన తన భార్య లక్ష్మీ, ఇతర మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని చెవిరెడ్డి ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలేసి అప్పగించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. లక్ష్మీని పీఎస్‌కు తీసుకెళ్లకుండా పలు ప్రాంతాలకు తిప్పుతున్నారని చెప్పారు. తనను కూడా అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తీసుకెళ్లకుండా రాంత్రంతా రోడ్లపైనే తిప్పారన్నారు. తమిళనాడుతో పాటు చాలాచోట్ల వాహనంలో తిప్పారని, తన ఆరోగ్యం బాగోలేదని, బీపీ టాబ్లెట్‌ ఇవ్వాలని అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా తన భార్య, బిడ్డలతో ఫోన్‌ లో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకు వెళతామన్నారు. పోలీసుల వేధింపులకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్‌ ప్రమేయంతోనే వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్పీ భార్య చంద్రబాబు నాయుడు బంధువు అని, అందుకే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. అరెస్ట్‌ తర్వాత పోలీసులు తమిళనాడుతో పాటు చాలాచోట్ల వాహనంలో తిప్పారని, తన ఆరోగ్యం బాగోలేదని, బీపీ టాబ్లెట్‌ ఇవ్వాలని అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా తన భార్య, బిడ్డలతో ఫోన్‌ లో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. మూడు రోజుల్లోనే 14,500 ఓట్లు తొలగించారని ఆరోపించారు. టీడీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. (ఓట్ల దొంగలను వదిలేసి గ్రామస్థులపై పోలీసుల దాడి) 

బాబుకు ఓటమి భయం పట్టుకుంది : వైవీ
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్‌ చేయడం దారుణమాన్నారు. ఆరోగ్యం బాగాలేదన్నా చెవిరెడ్డిని పోలీసులు పట్టించుకోలేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బాబుకు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top