రాజ్యాధికార ఫల సిద్ధిరస్తు

blessing to Harish Rao - Sakshi

హరీశ్‌రావు, సోలిపేటకు వేద పండితుల ఆశీర్వాదం

సాక్షి, సిద్దిపేట: ‘మాకోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ చర్యలు తీసుకుంది. దేవాలయాలను పునరుద్ధరించారు. వేతనాలు పెంచారు. మా కష్టసుఖాల్లో భాగస్వాములయ్యారు.. మీరే విజయం సాధించాలి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావాలి. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి.. రాజ్యాధికార ఫల సిద్ధిరస్తూ’ అంటూ మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని సిద్దిపేటకు చెందిన బ్రాహ్మణులు, అర్చకులు, పండితులు వేదమంత్రాలు చదువు తూ ఆశీర్వదించారు. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణుల మద్దతు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉంటుందని చెబుతూ, భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన వేద ఆశీర్వాద సభకు హరీశ్‌రావు, సోలిపేటలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురికి బ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో బ్రాహ్మణులు పలికిన మద్దతు మరువలేమన్నారు. రైల్‌ రోకోలు చేస్తుంటే అక్కడే యజ్ఞాలు చేశారని, కేసీఆర్‌ దీక్షకు కూడా మద్దతిచ్చి ‘తెలంగాణ రాష్ట్రం ప్రాప్తిరస్తూ’ అంటూ దీవించి పంపా రని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు బ్రాహ్మణులం టే ఎనలేని గౌరవమన్నారు. అందుకే ఆయనను బ్రాహ్మణ బంధుగా పిలుస్తారని చెప్పారు.

పెద జీయర్‌ స్వామి, చిన జీయర్‌ స్వామి, భారతీ తీర్థానందస్వామి, తొగుట మధురానంద స్వామి.. ఇలా అందరి ఆశీస్సులతో ముందుకు సాగామని చెప్పారు.  పూజారుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. ‘వేదాలు చదివిన నోటితో ఏం చెబితే అది జరుగుతుందని, మీ ఆశీస్సులు మాకు కొండంత బలం’ అని అన్నారు. మీ దీవెనలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరో పది, పదిహేనేళ్లు కేసీఆర్‌ రాష్ట్రానికి సీఎంగా ఉండాల్సిన అవసరం ఉంద న్నారు. సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ, ఎక్కడా లేనివిధంగా బ్రాహ్మణులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలపడం శుభసూచ కమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ శర్మ, కేసీఆర్‌ గురువు మృత్యుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top