విశాఖపట్నం : తల్లీ నిన్నే నమ్ముకున్నాం.. కరుణించి కాపాడమ్మా.. తమ కుటుంబాలను చల్లంగా చూడమ్మా.. అంటూ మత్స్యకారులు నిండు మనసుతో గంగమ్మతల్లిని వేడుకున్నారు. క్షీరాభిషేకంతోపాటు పూజలు నిర్వహించారు. గంగమ్మతల్లి పూజా మహోత్సవం జాలరిపేటలో శుక్రవారం కనుల పండువగా జరిగింది.
2004 డిసెంబర్ 26న సునామీ సృష్టించిన బీభత్సం అనంతరం ఏటా అదే రోజున పెదజాలరిపేట గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులు గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా మత్స్యకార మహిళల కలశాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. అనంతరం మహిళలు తీరంలో వరుస క్రమంలో నిలిచి, కొబ్బరికాయలు కొట్టి, పూజలు నిర్వహించారు.
సముద్రుడికి హారతి ఇవ్వడంతో పాటు పూజ చేసిన పసుపు నీటిని, పాలను సముద్రంలో కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
తమ కుటుంబాలను చల్లంగా చూడాలని.. చేపల వేట సమయంలో విపత్తుల నుంచి రక్షించాలని గంగమ్మతల్లిని వేడుకున్నారు.


