
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికలను అభివృద్ధి, వారసత్వ రాజకీయాల మధ్య పోరాటంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కచ్ జిల్లా భుజ్లో సోమవారం జరిగిన ర్యాలీనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘గుజరాత్ బిడ్డగా ప్రజా జీవితంలో తనపై ఎలాంటి మచ్చా లేదు...మీరు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే గుజరాతీలు క్షమించరని అన్నారు.
డోక్లాం సరిహద్దుల్లో మన సైనికులు 70 రోజుల పాటు కంటిమీద కునుకులేకుండా పనిచేస్తే చైనా రాయబారిని మీరు (రాహుల్) ఎందుకు కౌగిలించుకున్నారని ప్రశ్నించారు. డిసెంబర్ 9న తొలివిడత పోలింగ్ జరగనున్న సౌరాష్ర్ట, దక్షిణ గుజరాత్లో ప్రధాని పలు ర్యాలీల్లో పాల్గొననున్నారు. మరోవైపు గుజరాత్ ర్యాలీల్లో రాఫెల్ యుద్ధ విమానాల డీల్కు సంబంధించి మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
బీజేపీ తుదివిడత జాబితా..
గుజరాత్లో మలివిడత పోలింగ్కు సంబంధించి 34 మంది అభ్యర్థులతో బీజేపీ తుది జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఓ మంత్రి సహా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ పేరు కూడా జాబితాలో లేకపోవడం గమనార్హం. ఆనంద్ నుంచి మంత్రి రోహిత్ పటేల్కు బీజేపీ మొండిచేయి చూపింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సిద్ధ్పూర్ నుంచే మాజీ మంత్రి, పార్టీ ప్రతినిధి జయనారాయణ్ వ్యాస్ను బరిలో దింపింది.
కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంఎల్ఏ తేజశ్రీబెన్ పటేల్, మాజీ కాంగ్రెస్ ఎంఎల్ఏ కరంశ్వి మక్వానా కుమారుడు కణు మక్వానాలకు తుది జాబితాలో చోటు దక్కింది. ఈ జాబితాలో 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు.