‘ఓటమి తర్వాత ఏపీ ప్రజల్ని తిట్టకండి’

BJP Leader Vishnuvardhan Reddy Fire On Chandrababu Naidu In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు ఎవరి దగ్గరికి వెళ్లినా వాళ్లందరికీ మిమ్మల్నే ప్రధాని చేస్తానని అంటున్నారు.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి తప్ప దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులకి ప్రధానిని చేస్తానని మాట ఇచ్చారని ఎద్దేవా చేశారు. టీడీపీ చరిత్రలో బీజేపీ లేకుండా ఎప్పుడైనా గెలిచిందా అని విష్ణువర్దన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో విష్ణువర్ధన్‌ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని రకాల సర్వే సంస్థలు చెప్పాయి.. ఇది ఓర్చుకోలేని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇంకా ప్రజల్ని మభ్యపెడుతున్నాయని వ్యాఖ్యానించారు.

‘బీజేపీ దేశంలో సొంతంగా అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ఇంత హడావిడి చేయడం లేదు..కానీ ప్రజల సొమ్ముతో చంద్రబాబు మాత్రం ఇంకా హడావిడి చేస్తున్నారు. బాబును రాజకీయ దళారీగా అందరూ చూడాల్సిన అవసరముంది. 2014లో మాతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ని నమ్మాలని అన్నాడు. అదే వ్యక్తి ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ను తప్పు పడుతూ సర్వే సంస్థలను తిడుతున్నాడ’ని విష్ణువర్ధన్‌ రెడ్డి మండిపడ్డారు.

‘1984లో టీడీపీకి సర్వే చేశాను అని చంద్రబాబు అంటున్నారు. కానీ ఆయనకు మతిమరుపు అనుకుంటా.. అప్పుడు బాబు గారు కాంగ్రెస్‌లో ఉన్నారు.. అంటే అప్పటి నుంచే వెన్నుపోటు రాజకీయాలు ఆరంభించారా అని అడుగుతున్నా. ఢిల్లీలో చంద్రబాబును దేఖే వారు లేరు.. ఆయన వస్తే భయపడుతున్నారు. ఎందుకు బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అడుగుతున్నా. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా బాబు ఆగడం లేదు. ఓటమి తర్వాత ఈవీఎంలను, ఏపీ ప్రజలను తిట్టకండి అని కోరుతున్నా. మీరు పిలిచి ఏర్పాటు చేసిన మీటింగ్‌కు ఎందుకు డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌, కర్ణాటక సీఎం కుమారస్వామి రావడం లేద’ ని ప్రశ్నించారు.

‘ఎన్నికల తర్వాత ఆంధ్రాలో టీడీపీ ఆఫీసు గాంధీ భవన్‌గా మారుతుంది. చంద్రబాబు ఒక ఐరన్‌ లెగ్‌.. ఎక్కడ ఆయన అడుగుపెడితే అక్కడ అంతా నాశనం. ఓవర్‌ యాక్షన్‌ తగ్గిస్తే మేలు అని సలహా ఇస్తున్నాం. టీడీపీ వాళ్ల ప్రెస్‌ మీట్లు  సినిమా వినోదాన్ని అందించే విధంగా ఉన్నాయ్‌. లగడపాటి సర్వేలో టీడీపీ గెలుస్తుందని చెబుతూనే.. బెట్టింగ్‌లో జగన్‌ గెలుస్తారని టీడీపీ కిందిస్థాయి నాయకులు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఫలితాల అనంతరం టీడీపీ పెద్ద ఎత్తున అల్లర్లు చేసేవిధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ఫలితాల తర్వాత అల్లర్లు జరగకుండా ఈసీ, పోలీసులు భద్రత ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాను. ఇంత తప్పుడు పనులు చేసే బాబును దేశద్రోహి అనడంలో తప్పేం లేదని అనిపిస్తోంది. ఆయన బీజేపీ నుంచి దూరంగా వెళ్లి మాకు న్యాయం చేశారు. మీరు(బాబు) వస్తా అంటే బీజేపీ గేట్లు మూసేస్తామన’ని నొక్కి వక్కాణించి విష్ణువర్ధన్‌ రెడ్డి చెప్పారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
టీడీపీ చరిత్రలో బీజేపీ లేకుండా ఎప్పుడైనా గెలిచిందా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top