బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం: జైపాల్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం: జైపాల్‌రెడ్డి

Published Wed, Oct 18 2017 2:41 AM

The BJP is the fear to KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ సర్కారు అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు వణుకని, ఆయన చేస్తున్న తప్పులు ఈడీ, సీబీఐలకు తెలుస్తాయన్న భయంతో ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే సమాచారం తనకు లేదని, ఎవరు పార్టీలోకి రావాలో హైకమాండ్‌ నిర్ణయిస్తుందని, అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తానని చెప్పారు.

టీఆర్‌ఎస్, బీజేపీలతో సంబంధంలేని ఏ పార్టీ తమతో కలసివచ్చినా మంచిదేనని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్‌ ధరలను ఎందుకు తగ్గించడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తాజ్‌మహల్‌ మన దేశ సంస్కృతిలో భాగంకాదని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడటం అభ్యంతరకరమన్నారు.

ఈ అంశంపై ప్రధాని మోదీ అభిప్రాయమేమిటో స్పష్టం చెయ్యాలని కోరారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి ప్రాజెక్ట్‌ పూర్తికావాలంటే రూ.2వేల 150 కోట్లు కావాలని అసెంబ్లీలో చెప్పిన ప్రభుత్వం బడ్జెట్‌లో అంత మొత్తం నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు.  

Advertisement
Advertisement