కేసీఆర్‌ పెద్ద బఫూన్‌... | Assembly Dissolved : Congress Leaders Attack On KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పెద్ద బఫూన్‌...

Sep 6 2018 5:42 PM | Updated on Sep 6 2018 6:43 PM

Assembly Dissolved : Congress Leaders Attack On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ తొట్టతొలి అసెంబ్లీని రద్దు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. 9 నెలలు త్యాగం చేశా అంటున్నావ్‌, ఎవరి కోసం 9 నెలలు త్యాగం చేశారంటూ కేసీఆర్‌ను కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెబుతూ మోసగిస్తున్నారని, కేసీఆరే తెలంగాణకు పెద్ద బఫూన్‌ అని విమర్శించారు. సర్వేల్లో 100 సీట్లు వస్తాయని కేసీఆర్‌ చెబుతున్నారని, 100 సీట్లు వచ్చేటప్పుడు ముందస్తు ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. మీ అహంకారాన్ని మీ కాళ్ల ముందు పెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌ను త్వరగా ఇంటికి పంపించేస్తారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటి విషయంలోనూ, వారిని మోసం చేసినట్టు డీకే అరుణ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు.  

ప్రతిపక్ష హోదా కూడా రాదని కేసీఆర్‌కు భయం...
రాబోయే ఎన్నికలు సరియైన సమయంలో జరిగితే టీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని కేసీఆర్‌కు భయమేస్తుందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు శాతం విఫలమయ్యాయని విమర్శించారు. రాహుల్‌ గాంధీని తిట్టడం, కాంగ్రెస్‌ను ఆడిపోసుకోవడంతో హామీల ప్రస్తావన నుంచి తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 7 నెలల పాటు తెలంగాణలో జరుగాల్సిన అభివృద్ధి కార్యకలాపాలన్నీ కుంటిపడతాయని తెలిపారు. వీటికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ దొంగలేనని, చేసిన తప్పులన్నీ కాంగ్రెస్‌పై నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందని ఆ పార్టీనేనని గుర్తుంచుకోవాలన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement