సీఎం జగన్‌పై ఎమ్మెల్యేల ప్రశంసలు | APCOS Launched In AP YSRCP MLAs Applauds CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై ఎమ్మెల్యేల ప్రశంసలు

Jul 3 2020 2:49 PM | Updated on Jul 3 2020 3:40 PM

APCOS Launched In AP YSRCP MLAs Applauds CM YS Jagan - Sakshi

ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి‌పై ప్రశంసలు కురిపించారు.

సాక్షి, తాడేపల్లి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌)ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి‌పై ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు, కష్టాలు తెలుసుకున్న వైఎస్‌ జగన్ వారి కష్టాలు తీర్చడానికి ఆప్కాస్ ఏర్పాటు చేశారని అన్నారు. 

చంద్రబాబు పాలనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు లంచాలు ఇచ్చి ఇబ్బందులు పడేవారని జోగి రమేష్ గుర్తు చేశారు. ఉద్యోగంలో చేరినా జీతాలు సమయానికి రాక తీవ్ర తీవ్ర కష్టాలు పడ్డారని తెలిపారు. టీడీపీ హయాంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వందల కోట్ల రూపాయలు తీనేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పించే విధంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అందులోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని వెల్లడించారు.

బీసీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు అనడం విడ్డూరంగా ఉందని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. రూ.151 కోట్ల అవినీతికి పాల్పడ్డ అచ్చెన్నాయుడిని అరెస్టే చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు దోచుకున్న సొమ్ములో చంద్రబాబు, లోకేష్‌కు వాటా ఉందని అన్నారు. మచిలీపట్నంలో బలహీన వర్గాల నేతగా ఎదుగుతున్న మోకా భాస్కర్ రావును హత్య చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మోకా భాస్కర్ రావు హత్యకు కుట్ర జరిగిందని పేర్కొన్నారు. వెంటనే కొల్లు రవీంద్రను అరెస్టు చేయాలని జోగి రమేష్ ప్రభుత్వాన్ని కోరారు.
(చదవండి: మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్‌)

దేవినేనివి పనికిమాలిన మాటలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని ద్వారానే వారికి జీతాలు పంపిణీ చేయడం అద్భుతమైన చర్య అని ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డబ్బులు ఇస్తేనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ పనితీరు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోతున్నాయని అన్నారు. దేవినేని ఉమా పనికిమాలిన వాడని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విమర్శించారు. అందుకే అన్నీ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దల గురించి తెలుగుదేశం నాయకులు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సుధాకర్‌బాబు హెచ్చరించారు.
(చదవండి: కళాఖ్యాతి.. గడప దాటి)

Advertisement
 
Advertisement
Advertisement