అయోధ్య తీర్పు జాప్యానికి ఆ పార్టీయే కారణం! | Amit Shah slams Congress in Jharkhand | Sakshi
Sakshi News home page

అయోధ్య తీర్పు జాప్యానికి ఆ పార్టీయే కారణం!

Nov 21 2019 3:05 PM | Updated on Nov 21 2019 3:12 PM

Amit Shah slams Congress in Jharkhand - Sakshi

లాతెహర్‌ (జార్ఖండ్‌):  అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిప్పులు చెరిగారు.  అయోధ్య తీర్పు జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన నిందించారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 2.77 ఎకరాల భూమిని పూర్తిగా బాలరాముడికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయోధ్యలోని ప్రముఖ ప్రదేశంలో ముస్లింలు మసీదు కట్టుకోవడానికి ఐదు ఎకరాలను ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.


సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జార్ఖండ్‌ లాతెహర్‌లో గురువారం అమిత్‌ షా ప్రసంగిస్తూ.. ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ కావాలనే అయోధ్య తీర్పు జాప్యానికి కారణమైందని విమర్శించారు. ‘అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? మీరే చెప్పండి. కానీ, కాంగ్రెస్‌ ఈ కేసు విచారణ జరగకుండా చూసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడంతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది’ అని షా అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం కృషి చేయలేదని, మోదీ సర్కారు ప్రతి ఆదివాసీ బ్లాకులోనూ ఏకలవ్య స్కూళ్లను ఏర్పాటుచేసి.. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నారని షా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement