మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల సందడి
మెల్బోర్న్ : మెల్బోర్న్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 'జగన్ వెంటే మేమంతా' అని ఉన్న ప్లెక్సీలు పట్టుకుని, సోషల్మీడియా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఇంచార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేశ్ శాఖమూరిలతో పాటూ పలువురు ఎన్ఆర్ఐలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
భారత్- ఆస్ట్రేలియా రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ గెలిచే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలన్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ను దిగిన ఆసీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. అనంతరం వర్షం కురవడం ప్రారంభమై, ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.