'నాన్నా.. నువ్వు అమ్మతో ఎందుకు ఉండట్లేదు?' | Why don't you stay with mom, child asks dad in custody battle | Sakshi
Sakshi News home page

'నాన్నా.. నువ్వు అమ్మతో ఎందుకు ఉండట్లేదు?'

Jun 15 2016 9:09 AM | Updated on Sep 4 2017 2:33 AM

'నాన్నా.. నువ్వు అమ్మతో ఎందుకు ఉండట్లేదు?'

'నాన్నా.. నువ్వు అమ్మతో ఎందుకు ఉండట్లేదు?'

ఓ ఆరేళ్ల పాప 'ఎందుకు నువ్వు రావడం లేదు? అమ్మతో ఎందుకు ఉండటం లేదు? మేం కోరుకుంటున్నట్లుగా మాతో ఉంటానని నువ్వు కోర్టులో చెప్పలేవా?' అంటూ ఓ తండ్రిని సాక్షాత్తు జడ్జి, న్యాయవాదుల ముందు ఏడుస్తూ ప్రశ్నించింది.

కోల్కతా: బంధాలు బరువైనవే.. కానీ వాటిని మోయడమంటేనే హృదయానికి ఇష్టం, అలా మోస్తున్న మనిషే అందరికీ అందంగా కనిపిస్తాడు కూడా. ముఖ్యంగా భావోద్వేగాల సమయంలో ఇవి మరింత భారంగా కనిపిస్తాయి. అప్పటికీ కూడా అలా పట్టుకొని ఉండేందుకే మనిషి మొగ్గుచూపుతాడు. కానీ, ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారవుతున్నాయి. ఓ పాటలో చెప్పినట్లు మాయమైపోతున్నడు మనిషన్నవాడు.. నిజమే కొన్ని చోట్ల మనిషి ఇప్పటికే మాయమయ్యాడు. అందుకే కొందరి జీవితంలో కన్నీళ్లు.. కష్టాలు. తాను లేని లోటును స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నా కొందరివి ఏమాత్రం కరగని కఠువు హృదయాలు. అలాంటి హృదయమే ఉన్న వ్యక్తి ఓ ఆరేళ్లపాపకు తండ్రిగా ఉంటే.. తమతో ఉండిపోండి నాన్నా అంటూ ఆ పాప కోరుకుంటున్నా అతడి నోట వెంట కనీసం ఒక్కమాట రాకుండా ఉంటే..

సరిగ్గా కోల్ కతా హైకోర్టులో ఈ సంఘటన దర్శనం ఇచ్చింది. ఓ ఆరేళ్ల పాప 'ఎందుకు నువ్వు రావడం లేదు? అమ్మతో ఎందుకు ఉండటం లేదు? మేం కోరుకుంటున్నట్లుగా మాతో ఉంటానని నువ్వు కోర్టులో చెప్పలేవా?' అంటూ ఓ తండ్రిని సాక్షాత్తు జడ్జి, న్యాయవాదుల ముందు ఏడుస్తూ ప్రశ్నించింది. అక్కడే ఉన్న తన చిన్నారి సోదరుడు కూడా ఏడుస్తూ 'మా అక్క మానాన్నతో ఉంటే నేను కూడా తనతోనే ఉంటాను' అంటూ ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో వారిద్దరి చెంపలపై కన్నీళ్లు వస్తుండగా.. ఓ మూలకు నిల్చున్న వారి తల్లి వెక్కివెక్కి ఏడుస్తుంది. ఈ దృశ్యం చూసిన వారెవ్వరికీ అక్కడ నోట వెంట ఒక్క మాటా రాలేదు. ఇది పెళ్లి చేసుకొని విడిపోయి వేర్వేరుగా ఉంటున్న ఓ తల్లిదండ్రుల కేసుకు సంబంధించిన విషయం.

ఈ దంపతులు ఇద్దరు తొలుత 2005లో కలుసుకున్నారు. ఇష్టంతో వివాహం చేసుకున్నారు. ఆమె హిందువు. కానీ, తన భర్త ఇష్టం మేరకు ఇస్లాంలోకి మారింది. పేరు కూడా మార్చుకుంది. 2010లో వారికి ఓ పాప.. 2012లో బాబు జన్మించాడు. అయితే, కాలక్రమంలో తన భర్త తీరు అనుమానాస్పదంగా మారడంతో ముందు జాగ్రత్తతో ఆమె తన పిల్లలతో కలసి సిలిగురిలో జీవిస్తోంది. తనతోపాటే ఉండాలని ఆమె అతడిని కోరింది. కానీ అందుకు అతడు నిరాకరించాడు. ఇలా వారిద్దరి మధ్య దూరం పెరిగి వాదనలు ప్రారంభమై చివరకు పిల్లలను పంచుకునేకాడికి వచ్చింది.

అతడు 2016 ఫిబ్రవరిలో సిలిగిరి కోర్టుకు వెళ్లగా బాలికను తండ్రితో.. బాలుడిని తల్లితో ఉంచాలని జడ్జి చెప్పారు. అయితే, కూతురు కూడా తనతో ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో పిటిషన్ తల్లి వేసింది. అయితే ఈ కేసుపై మే 17న కేసు విచారించిన జడ్జి సమ్మర్ పూర్తయ్యే వరకు ఇద్దర్ని తల్లితో ఉంచేందుకు అనుమతిచ్చారు. ప్రస్తుతం సమ్మర్ అయిపోవడంతో మంగళవారం ఈ కేసు మరోసారి కోర్టులో వాదనలకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ ఆరేళ్ల చిన్నారి తండ్రిని ఏడుస్తూ నిలదీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement