
కాంగ్రెస్ కు సీపీఎం షాక్
కేంద్రంలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యక్తిగత అవినీతి ఆరోపణలపై ఇతర విపక్షాల మద్దతు కూడగట్టాలకున్న కాంగ్రెస్ పార్టీకి సీపీఎం షాక్ ఇచ్చింది.
మంగళవారం ప్రతిపక్ష పార్టీలతో సంయుక్తంగా నిర్వహించనున్న విలేకరుల సమావేశానికి తాము హాజరుకావడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హాజరైతే 16 విపక్ష పార్టీలు విలేకరుల సమావేశానికి రావని వెల్లడించారు. కాంగ్రెస్ సరిగా వ్యూహాలు రచించలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ఉమ్మడి విలేకరుల సమవేశానికి వెళ్లాలా, వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం అందిందని మమతా బెనర్జీ వెల్లడించారు. రేపు జరగనున్న విలేకరుల సమావేశానికి ఏయే పార్టీలు హాజరవుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.