రైతుకు కొత్త ధీమా | The new farmer confidence | Sakshi
Sakshi News home page

రైతుకు కొత్త ధీమా

Jan 14 2016 4:30 AM | Updated on Oct 1 2018 2:09 PM

రైతుకు కొత్త ధీమా - Sakshi

రైతుకు కొత్త ధీమా

అతివృష్టి, అనావృష్టి.. అకాల వర్షాలు, కరవులతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పంట బీమా పథకాన్ని ప్రకటించింది.

ప్రధానమంత్రి పంట బీమా పథకం ప్రకటన
అతి తక్కువ ప్రీమియంతో పంటలకు బీమా రక్షణ

 
రైతులు కట్టేది ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం
♦ ఆహారధాన్యాలు, నూనెగింజల పంటలకు వర్తింపు
♦ వాణిజ్య పంటలకు రైతులు 5% ప్రీమియం చెల్లించాలి
♦ కేంద్ర కేబినెట్ ఆమోదం.. వచ్చే ఖరీఫ్ నుంచి అమలు
 
 సాక్షి, న్యూఢిల్లీ: అతివృష్టి, అనావృష్టి.. అకాల వర్షాలు, కరవులతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పంట బీమా పథకాన్ని ప్రకటించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)కు ఆమోదముద్ర వేసింది. ఈ పథకం కింద.. ఖరీఫ్ ఆహార ధాన్యాలు / నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే.. రబీ ఆహారధాన్యాలు / నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 1.5 శాతం చెల్లిస్తే చాలు. ప్రీమియంలో మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.

దేశవ్యాప్తంగా గల మొత్తం 19,440 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణంలో సగం పంటల బీమాను కేంద్రం భరించటానికి ఏటా రూ. 8,800 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ ఏడాది జూన్ నుంచి మొదలు కానున్న ఖరీఫ్ పంటల నుంచి ఈ బీమా పథకం అమలులోకి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి పూర్తి బీమాను రైతులకు అందిస్తారు. అయితే వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటల బీమాకు రైతులు ఐదు శాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు.

 చరిత్రలో అతి తక్కువ ప్రీమయం...
 కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పంటలకు తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ ఉండేలా క్లెయిమ్‌లు సులభంగా ఉండేలా చేస్తూ కొత్త పంట బీమా పథకాన్ని తీసుకువస్తామని ప్రకటించింది. ఆమేరకు బుధవారం ప్రకటించిన కొత్త పథకంతో రైతులు సంతోషిస్తారని ఆశిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌లతో వెంకయ్యనాయుడు మీడియాకు వివరించారు.

కౌలు రైతులకు కూడా ఈ పంట బీమా పథకం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనున్నట్లు చెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలో రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లించే పంట బీమా ఇదే అవుతుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులతో దెబ్బతింటున్న పంటలకు.. అతి తక్కువ ప్రీమియం చెల్లించి బీమా రక్షణ పొందగల ఈ కొత్త పథకం రైతులు ఆర్థిక అనిశ్చితులనుంచి బయటపడేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతమున్న రెండు పంట బీమా పథకాల (జాతీయ వ్యవసాయ బీమా పథకం, సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం) కింద.. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం 15 శాతం వరకూ ఉంటుంది. అయితే.. పంటలు, ప్రాంతాలకు గల ముప్పును బట్టి ఈ ప్రీమియం 57 శాతం వరకూ కూడా ఉంటుంది.
 
 పథకంలోని ముఖ్యాంశాలివీ...
 ► పొలంలో ఉన్న పంటకు జరిగిన నష్టంతో పాటు విత్తులు / నాట్లు వేయలేకపోవటం, పంట కోత తర్వాత జరిగే నష్టాలకూ బీమా వర్తిస్తుంది. వరద ముంపు వంటి విపత్తులకు వర్తిస్తుంది.
 ► పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయటం జరుగుతుంది.
 ► క్లెయిమ్ సెటిల్ కోసం పంట నష్టాన్ని అంచనా వేయటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా.. పంట కోత సమాచారాన్ని ఫొటోలు తీసి, అప్‌లోడ్ చేస్తారు. పంట కోతలతో పరిశీలనలను తగ్గించేందుకు రిమోట్ సెన్సింగ్‌ను వినియోగిస్తారు.
 ► బ్యాంకు రుణాలు తీసుకున్న వారు పంట బీమా ప్రస్తుతం తప్పనిసరి. కొత్త పథకం కింద రుణం తీసుకున్న వారూ, తీసుకోని వారూ తమ అభీష్టం మేరకు బీమా చేయించుకోవచ్చు.
 ► ప్రభుత్వ రాయితీపై గరిష్ట పరిమితి లేదు.  ప్రీమియం 90 శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం భరిస్తుంది.
 ► {పీమియం ధరపై పరిమితిని విధిస్తున్న నిబంధన వల్ల రైతులకు తక్కువ క్లెయిములు చెల్లిస్తుండటంతో ఆ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. బీమా చేసిన పూర్తి మొత్తాన్ని ఎటువంటి మినహాయింపులూ లేకుండా పొందుతారు.
 ► వచ్చే మూడేళ్లలో.. మొత్తం పంటల విస్తీర్ణంలో బీమా కవరేజీని 50శాతానికి పెంచనున్నారు. ఇందుకు ఏడాదికి రూ. 17,600 కోట్లు వ్యయమవుతుంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.
 ► తొలి ఏడాది 2016-17 లో మొత్తం పంట విస్తీర్ణంలో 30 శాతానికి బీమా వర్తింపచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రూ. 5,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
 ► మొత్తం రాష్ట్రానికి ఒక బీమా కంపెనీ ఉంటుంది. విపత్తులతో జరిగే నష్టానికి, కోతల తర్వాత జరిగే నష్టానికి పొలం స్థాయిలో అంచనా వేయటం జరుగుతుంది. భారత వ్యవసాయ బీమా సంస్థతో పాటు ప్రయివేటు బీమా కంపెనీలూ ఈ పథకాన్ని అమలు చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement