వివాదాస్పదమైన లోక్పాల్ ఎంపిక నిబంధనలను పునఃసమీక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అంగీకరించింది.
లోక్పాల్పై ‘సుప్రీం’లో కేంద్రం అంగీకారం
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన లోక్పాల్ ఎంపిక నిబంధనలను పునఃసమీక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అంగీకరించింది. నిబంధనల్లో తుది సవరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదించింది. లోక్పాల్ చైర్పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ నిబంధనలను సవాల్ చేస్తూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
లోక్పాల్, లోకాయుక్త చట్టం కింద రూపొందించిన సెర్చ్ కమిటీ నిబంధనలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని గత విచారణ (ఏప్రిల్ 1న)లో ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు నిబంధనలు 10(1), 10(4)లను పునఃసమీక్షించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ సోమవారం ధర్మాసనానికి నివేదించారు. ఆయన ప్రకటనను నమోదుచేసుకున్న ధర్మాసనం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది.