తమిళనాడుకు నీళ్లివ్వండి | Supreme Court orders Karnataka to release 2000 cusecs daily to TN | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు నీళ్లివ్వండి

Oct 5 2016 1:29 AM | Updated on Sep 27 2018 8:27 PM

తమిళనాడుకు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున అక్టోబర్ 7 నుంచి 18 వరకూ కావేరి జలాల్ని విడుదల చేయాలని...

కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున అక్టోబర్ 7 నుంచి 18 వరకూ కావేరి జలాల్ని విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటకను ఆదేశించింది. సెప్టెంబర్ 5 నుంచి 30 వరకూ 17.5 టీఎంసీల నీటిని విడుదల చేశామని,ఈ నెల 6 నుంచి మరో 3.1 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్న క ర్ణాటక లిఖిత పూర్వక సమాచారం మేరకు సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. కావేరి నీటి నిర్వహణ మండలి సుప్రీం పరిధిలోకి రాదని, సరైన అవగాహన లేక గతంలో మండలి ఏర్పాటుకు సమ్మతించామని కేంద్రం తెలిపింది.

తమిళనాడు మాత్రం మండలి ఏర్పాటుకు పట్టుబట్టింది. తమిళనాడుకు నీటి విడుదలతో పాటు కేంద్ర జలసంఘం చైర్మన్ జీఎస్ ఝా నేతృత్వంలోని నిపుణుల కమిటీ కావేరి నదీ పరివాహక రాష్ట్రాల్లో పర్యటించి ఈ నెల 17న నివేదిక అందజేయాలని సుప్రీం సూచించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుపై స్టే విధిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.
 
నీటి మట్టాలు పరిశీలించనున్న కమిటీ
కేంద్ర జల సంఘం చైర్మన్ జీఎస్ ఝా నేతృత్వంలోని నిపుణుల బృందం అక్టోబర్ 7 నుంచి 15 వరకూ కావేరీ పరీవాహ క ప్రాంతంలో పర్యటించి డ్యామ్‌ల నీటిమట్టాలు, పంటలు వంటి క్షేత్ర స్థాయి వివరాల్ని సేకరించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement