
విపక్ష నేతలు పాకిస్తాన్లో పోటీ చేస్తే గెలుస్తారన్న రాంమాధవ్
గువహటి : రానున్న లోక్సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్లో పోటీ చేస్తే గెలుపొందడం ఖాయమని బీజేపీ నేత రాంమాధవ్ ఎద్దేవా చేశారు. విపక్ష నేతలు చేస్తున్న ట్వీట్లు భారత్లో కంటే అధికంగా పాకిస్తాన్లోనే రీట్వీట్ అవుతున్నాయని ఆరోపించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ట్వీట్లు మనదేశంలో కంటే పొరుగు దేశంలోని ప్రజలే ఎక్కువగా రీట్వీట్ చేస్తున్నారని, వారు అక్కడికి (పాకిస్తాన్) వెళ్లి ఎన్నికల్లో పోటీ చేస్తే వారు గెలుపొందే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో విపక్ష తీరు ఇలా ఉందని రాంమాధవ్ ఎండగట్టారు. విపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రతిపక్ష నేతలు భారత్కు అనుకూలంగా మాట్లాడుతున్నారా లేక పాక్కు వత్తాసుపలుకుతున్నారా అనేది ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు. భారత సైన్యంపై విపక్ష నేతలు అమర్యాదకరమైన భాషను ప్రయోగిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో మోదీ ప్రభంజనం ఉందని, బీజేపీ దాని మిత్రపక్షాలు గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ స్ధానాలను ఈసారి కైవసం చేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు.