
విడాకుల గురించి తర్వాత మాట్లాడతా
రాష్ట్రంలో రెండు కూటములు విచ్ఛిన్నం కావడంపై రాజ్ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు.
సాక్షి ముంబై: రాష్ట్రంలో రెండు కూటములు విచ్ఛిన్నం కావడంపై రాజ్ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎమ్మెన్నెస్ల పేర్లు ఎత్తకుండానే ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు. అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ముఖ్యమంత్రి పదవి తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఆశపడుతున్నాయని, ఆ ఆశతోనే విడాకులు తీసుకున్నాయని, ఈ విడాకుల గురించి తర్వాత మాట్లాడతానన్నారు. ముందుగా రాష్ట్రాభివృద్ధిపై పార్టీలు దృష్టిపెట్టాలని హితవు పలికారు.
బ్లూప్రింట్ విడుదల..
ఎట్టకేలకు ఎమ్మెన్నెస్ బ్లూప్రింట్ విడుదల చేసింది. శివసేన నుంచి వైదొలగి ఎమ్మెన్నెస్ను స్థాపించిన కొత్తలోనే ఎమ్మెన్నెస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే రాష్ట్రం కోసం బ్లూప్రింట్ రూపొందించనున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటిదాకా ఆ బ్లూప్రింట్ ఏమిటో? అందులో ఎటువంటి విషయాలు ఉన్నాయో వెల్లడించలేదు. కాగా బుధవారం దసరా నవరాత్రులను పురస్కరించుకొని మాటుంగాలోని షణ్ముకానంద్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ బ్లూప్రింట్ను విడుదల చేశారు.
మహారాష్ట్ర అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమం కోసం అనేక మంది మద్దతుతో ఈ బ్లూప్రింట్ను రూపొందించినట్టు చెప్పారు. ప్రపంచంలో మహారాష్ట్రను ఒక ఉన్నత స్థాన ంలో నిలిపేలా లక్ష్యాలుండాలన్నారు. ఇందుకోసం ఏమి చేయవచ్చు...? ఎమి చేయాలి..? తదితర విషయాలను పొందుపర్చామని చెప్పారు. గత 65 ఏళ్ల నుంచి చెప్పిన మాటలే చెప్పడం, ఇచ్చిన హామీలనే ఇవ్వడం రాజకీయ పార్టీలకు అలవాటైందని, ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఎందుకు వెనుకబడుతున్నామో అర్థమవుతోందని, అభివృద్ధి గురించి ఆలోంచకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాజ్ పేర్కొన్నారు. చేయాలన్న తపన, అవినీతి నిర్మూలన చేసినట్టయితే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చునని చెప్పారు. బ్లూ ప్రింట్ విడుదలలో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు.
ఎమ్మెన్నెస్ తొలి జాబితా విడుదల
సాక్షి ముంబై: రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 153 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన 13 మంది ఎమ్మెల్యేలతోపాటు రెండో స్థానంలో నిలిచినవారందరికీ దాదాపుగా అవకాశం కల్పించింది.
ఎమ్మెన్నెస్ కార్యదర్శి, అసెంబ్లీ గ్రూప్ లీడర్ బాలా నాందగావ్కర్ , ప్రవీణ్ దరేకర్, మంగేష్ సాంగలే, శిశిర్ షిండే, ప్రకాష్ భోయిర్ తదితరులున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ టిక్కెట్పై విజయం సాధించిన ఘాట్కోపర్ ఎమ్మెల్యే రామ్ కదం ఇటీవలే బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో దిలీప్ లాండేను బరిలోకి దింపనున్నట్టు ఎమ్మెన్నెస్ ప్రకటించింది. ఆయనతోపాటు రాజేంద్ర శిరోడ్కర్, శాలిని ఠాక్రే, రైస్ లష్కరియా, శిల్పా సర్పోద్దార్, సుధాకర్ చవాన్, పరుశురామ్ ఉపర్కర్ తదితరుల పేర్లు ముందు నుంచి ఊహించినట్టుగానే జాబితాలో ఉన్నాయి.