పోలీస్‌ అధికారి కుర్చీలో రాధే మా! | Radhe Maa sits in SHO's chair | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అధికారి కుర్చీలో రాధే మా!

Oct 6 2017 5:10 AM | Updated on Aug 21 2018 7:53 PM

Radhe Maa sits in SHO's chair - Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద సాధ్వీ రాధే మా మళ్లీ వార్తల్లోకెక్కారు. ఢిల్లీలోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆమె స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌ఓ) సీట్లో కూర్చున్నారు. ఆమె పక్కనే ఎస్‌హెచ్‌ఓ సంజయ్‌ శర్మ మెడలో ఎర్రటి శాలువాతో చేతులు కట్టుకొని నిలబడి ఉన్న ఫొటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక వివేక్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇది చోటుచేసుకుంది. దీనిపై స్టేషన్‌ అధికారి సంజయ్‌ శర్మను ప్రశ్నించగా.. రాధే మా రామ్‌లీలా మైదానానికి వెళ్లే మార్గంలో తమ స్టేషన్‌ ముందు ఆగి, స్టేషన్‌లో ఉన్న టాయిలెట్‌ను ఉపయోగించుకున్న తర్వాత ఆమె తన కుర్చీలో కూర్చున్నారని తెలిపారు.

తన సీటు నుంచి లేవాలని రాధే మాను చేతులు జోడించి అభ్యర్థించానని, ఆ సమయంలోనే ఫొటో తీశారని ఎస్‌హెచ్‌ఓ చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే రామ్‌లీలా మైదానంలోని జీటీబీ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు అధికారులు భక్తి పాటలకు డ్యాన్స్‌ చేస్తూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో రాధే మాతో పాటు ఐదుగురు పోలీస్‌ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనలు సెప్టెంబర్‌ 28, 29 తేదీల్లో జరిగాయి. ఈ వీడియోను రాధే మా ఫేస్‌బుక్‌ పేజీలో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియోలో ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని ప్రస్తుతం విధుల నుంచి తప్పించి హోల్డ్‌లో ఉంచామని ఉన్నతాధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement