సుదృఢ బంధానికి 10 సూత్రాలు | Sakshi
Sakshi News home page

సుదృఢ బంధానికి 10 సూత్రాలు

Published Thu, Jul 26 2018 2:33 AM

Prime Minister Narendra Modi addresses Uganda's Parliament - Sakshi

న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా దేశాల బంధం బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ 10 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. ఆఫ్రికా ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ సవాళ్లు, ఉగ్ర ముప్పు ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయన్నారు. రక్షణ, పర్యావరణం, సైబర్‌ భద్రత, వ్యవసాయం, సముద్ర వనరుల సద్వినియోగం తదితరాలకు సంబంధించి ఈ సూత్రాలను వివరించారు. అంతర్జాతీయ సంస్థల్లో ఆఫ్రికా దేశాలకు సమాన ప్రాధాన్యత లభించేంత వరకూ, అందులో సంస్కరణల కోసం భారత్‌ చేస్తున్న కృషి సంపూర్ణం కాదని తెలిపారు.

ఉగాండా పర్యటనలో ఉన్న మోదీ బుధవారం ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిం చారు. సమానత్వం, గౌరవం, పారదర్శకత కోసం ఆఫ్రికా చేస్తున్న ప్రయత్నాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోసారి ఆఫ్రికా వైరి రాజకీయాలకు వేదిక కాకుండా, యువత ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా భాసిల్లాలని వ్యాఖ్యానించారు. మిగతా ప్రపంచంతో కలసి ఆఫ్రికా దేశాలు ముందుకు సాగాలని, భారత్‌ వాటితో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అపారమైన ఖనిజ వనరులు, వార సత్వ సంపదకు నిలయమైన ఉగాండాకు తమ ఆఫ్రికా విధానంలో కేంద్రక స్థానం ఉంటుంద ని చెప్పారు.

వలస పాలన, స్వాతంత్య్ర ఉద్యమం, తీరప్రాంత సంబంధాలు తదితరాల్లో రెండు దేశాలకు చాలా సారూప్యతలు ఉన్నా యని చెప్పారు. సముద్ర సంపద నుంచి అన్ని దేశాలు ప్రయోజనం పొందేలా, భారత్‌ ఆఫ్రికా దేశాలతో కలసిపనిచేస్తుందని మోదీ అన్నారు.  తూర్పు ఆఫ్రికా, తూర్పు హిందూ మహాసముద్రాల్లో సహకారం తప్ప పోటీ ఉండొద్ద న్నారు. ఉగాండా పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. రాజధాని కంపాలాకు 85 కి.మీ దూరంలోని జింజా అనే గ్రామంలో జాతిపిత గాంధీ జ్ఞాపకార్థం వారసత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. కాగా, బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేం దుకు మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు.

Advertisement
Advertisement