కమల్‌నాథ్‌ బలపరీక్షకు బ్రేక్‌

No Floor Test Today In Madhya Pradesh Assembly   - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సోమవారం ఎదుర్కోవాల్సిన బలపరీక్షకు బ్రేక్‌ పడింది. అసెంబ్లీ సమావేశాలను స్పీకర్‌ ప్రజాపతి ఈనెల 26వరకూ వాయిదా వేశారు. అంతకుముందు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాజ్యాంగం నిర్ధేశించిన నియమాలను అందరూ గౌరవించి మధ్యప్రదేశ్‌ ప్రతిష్టను నిలపాలని సూచిస్తూ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. కాగా స్పీకర్‌ విధుల్లో జోక్యం చేసుకోరాదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు రాసిన లేఖలో కోరారు. ఇక సభను గౌరవించాలని కాంగ్రెస్‌ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా సోమవారం బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్‌ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

బీజేపీ సభ్యుల అభ్యంతరాలు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నినాదాల మధ్య సభను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. 22 మంది కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.  మరోవైపు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్‌ ఆమోదించడంతో సభలో సభ్యుల సంఖ్య 222కు పడిపోగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ మార్క్‌ 112. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.ఇక తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బలపరీక్షకు తాను సిద్ధమని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ పేర్కొనగా, ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే బలపరీక్షకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకాడుతోందని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు.

చదవండి : కమల్‌నాథ్‌కు ‘కోవిడ్‌’ ఊరట?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top